తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆదివారం అర్ధరాత్రి 12 గంటల వరకు జరిగాయి. సుమారు చివరి రెండు గంటల పాటు సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీకి మధ్య వాదోపవాదాలు జరిగాయి. బీఆర్ ఎస్ సభ్యులు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు పత్రాలను చించేసి విసిరి కొట్టి సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయిన తర్వాత ఎంఐఎం సభ్యుడు మైకు అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన కమిషన్ రిపోర్టుపై విమర్శలు గుప్పించారు. రిపోర్టు అసమగ్రంగా ఉందని, కేవలం ఒక కాంట్రాక్టర్ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విచారణ చేసినట్టు అర్థమవుతోందన్నారు. అంతేకాదు ఎలాంటి చర్యలూ సిఫారసు చేయలేదని తెలిపారు. దీనిని ఆధారంగా ఎలా చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు.
దీనికి సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా బదులిచ్చారు. పలు సందర్భాల్లో ఆయన “భయ్యా, నువ్వు రిపోర్టును పూర్తిగా చదివావా?” అని ప్రశ్నించారు. లక్ష కోట్ల రూపాయల అవినీతి, దుర్వినియోగం జరిగిందని కమిషన్ రిపోర్టు స్పష్టం చేసిందని సీఎం చెప్పారు. రిపోర్టును పూర్తిగా చదవితే గుండె తరుక్కు పోతుందన్నారు. అనేక దర్యాప్తు సంస్థల నుంచి వచ్చిన పత్రాలను కూడా ఘోష్ కమిషన్కు ఇచ్చామని, వారు సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత అన్ని కోణాల్లోనూ విచారించి నివేదిక ఇచ్చారని తెలిపారు.
అవినీతి పరులను ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కమిషన్ రిపోర్టు చదివిన తర్వాత ఎవరి మీద చర్యలు తీసుకోవాలనుకుంటారో, ఎలాంటి విచారణకు ఆదేశించమంటారో చెప్పాలని అక్బరుద్దీన్ను కోరారు. అక్బరుద్దీన్ ఎలాంటి విచారణకు ఆదేశించమన్నా ఆదేశిస్తామని చెప్పారు. సీబీఐకి ఇవ్వమన్నా ఇస్తామని, లేదంటే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయమన్నా చేస్తామని అన్నారు. అవినీతి సొమ్మును తిరిగి రాబట్టేందుకు సభ్యులు ఎవ్వరైనా సూచించవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా సీపీఐ ఎమ్మెల్యే, కాంగ్రెస్ మిత్రపక్షం సభ్యుడు కూనంనేని సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదన్నారు. తప్పు చేసి ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేదా సమయం వృథా చేయడం సరికాదన్నారు.
మొత్తంగా అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా సభ కొనసాగేలా ఉండటం గమనార్హం. అప్పటి వరకు కూడా బీఆర్ ఎస్ నాయకులు గన్ పార్క్ వద్ద ఆందోళన కొనసాగించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates