తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం జరిగిన రెండు కీలక బిల్లుపై చర్చలో విపక్షం బీఆర్ఎస్ తరఫున గంగుల కమలాకర్ బలమైన గళం వినిపించారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రి పొన్నం ప్రభాకర్లను లక్ష్యంగా చేసుకుని గంగుల విమర్శలు గుప్పించడమే కాకుండా ఆయా బిల్లులకు సంబంధించి కొన్ని సూచనలు కూడా చేశారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. “భలే చెప్పినవన్నా” అంటూ సభలోనే గంగుల భుజం తట్టారు.
ఏం మాట్లాడారు?
గంగుల కమలాకర్ ప్రధానంగా బీసీ రిజర్వేషన్ అంశంపై స్పందించారు. చాలా వివరాలను ఆయన సభ ముందుకు తెచ్చారు. ఒక సందర్భంలో మంత్రి పొన్నం సహా శ్రీధర్ బాబులు ఆయా విషయాలను తప్పకుండా పరిశీలిస్తామని చెప్పడం గమనార్హం. ముఖ్యంగా రిజర్వేషన్ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని, దీనిని భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాల్సిన అవసరం ఉందని గంగుల చెప్పారు. దీనికి సభ మొత్తం హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ 1992 కింద మాత్రమే డెడికేటెడ్ కమిషన్ వేయాలని గంగుల కోరారు.
అంతేకాదు తమ పార్టీ కూడా 42 శాతం రిజర్వేషన్లను బీసీలకే ఇవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అయితే ఇది నామమాత్రంగా బీసీల కన్నీళ్లు తుడిచేలాగా కాకుండా చిత్తశుద్ధితో చేయాలని ఆయన పేర్కొన్నారు. గతంలో బీహార్ ప్రభుత్వం కూడా ఇలానే చేసి చేతులు కాల్చుకుందని, అలా కాకుండా తమిళనాడులో 52 శాతం రిజర్వేషన్ కల్పించినా దానిని షెడ్యూల్ 9లో చేర్చేలా చర్యలు తీసుకున్నారని, ఫలితంగా అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని వివరించారు.
అలానే తెలంగాణలోనూ చర్యలు తీసుకోవాలని గంగుల సూచించారు. అయితే దీనికిగాను బిల్లును మరోసారి సవరించాల్సి ఉంటుందని సూచించారు. లేకపోతే మరోసారి ఎవరైనా కోర్టుకు వెళ్తే దానిని కొట్టివేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై ఈ సందర్భంలో సునిశిత విమర్శలు గుప్పించారు. కామారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సభలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రివర్గంలో 42 శాతం పదవులను బీసీలకు ఇస్తామన్నారని, మరి ఇప్పుడు ఆ మాట, ఆ డిక్లరేషన్ ఏమైందని గంగుల ప్రశ్నించారు.
మొత్తం చూస్తే సభలో అర్థవంతమైన చర్చ సాగిందనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates