నాయుడు వర్సెస్ రెడ్డి: తిరుమల హాట్ టాపిక్

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు, ఇదే పాలక మండలి మాజీ చైర్మన్, వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిల మధ్య వాదప్రతివాదాలు తారస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణల వరకు వివాదం ముదిరింది. తిరుపతి నుంచి భూమనను తరిమికొట్టాలని బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలపై భూమన తీవ్రంగా స్పందించారు. ఎవ‌రిని ఎవరు తరిమికొడతారో ప్రజలే తేలుస్తారని వ్యాఖ్యానించారు.

తిరుమల పవిత్రతను కాపాడాలని తాను వినతిచేసినా తనపై అపవాదులు మోపుతున్నారని భూమన అన్నారు. తిరుమలను ఆనుకుని ఉన్న భూములను పర్యాటక శాఖకు ఇవ్వడాన్ని తాను ఆది నుంచి తప్పుబట్టానని, ఇప్పటికీ అదే ప్రశ్న అడుగుతున్నానని స్పష్టం చేశారు. పవిత్ర కార్యాలయాలకే పరిమితం కావాల్సిన శ్రీవారి భూములను పర్యాటకం పేరుతో తాగి తందనాలాడేందుకు రిసార్టులకు కేటాయించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. దీనికి నాయుడు సమాధానం చెప్పాలన్నారు.

అయితే అసలు ఆ ప్రతిపాదన వైసీపీ హయాంలోనే వచ్చిందని, ప్రస్తుతం కాదని బీఆర్ నాయుడు తెలిపారు. తాము తిరుమల పవిత్రతను కాపాడే క్రమంలో ఆయా భూములను కాకుండా దూరంలోని వేరే భూములను కేటాయిస్తున్నామని చెప్పారు. మరోవైపు నాయుడు తమను బెదిరిస్తున్నారని, తిరుపతి నుంచి తరిమికొడతామన్నారని భూమన ఆరోపించారు. కానీ ఎవ‌రిని ఎవరు తరిమికొడతారో ప్రజలే తేలుస్తారని, అది ఎవరి చేతుల్లో లేదని అన్నారు.

ఇక నాయుడు చైర్మన్ గిరిపై కూడా భూమన తీవ్ర విమర్శలు చేశారు. “క్విడ్ ప్రో కో” కింద బీఆర్ నాయుడికి తిరుమల పాలక మండలి చైర్మన్ పదవి వచ్చిందని భూమన వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ ఇచ్చిన నాయుడు అలాగని నిరూపిస్తే ఇప్పుడే తాను పదవి నుంచి తప్పుకుంటానని అన్నారు. దీనిని నిరూపించాలా లేదా క్షమాపణ చెప్పాలా అని భూమనను నాయుడు డిమాండ్ చేశారు. మొత్తానికి నాయుడు వర్సెస్ రెడ్డి నేతల మధ్య వివాదాలు ముసురుకున్నాయి. ఇవి ఎంత దూరం వెళ్తాయో చూడాలి.