వైసీపీ పాలనా కాలంలో విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ ను ఏం చేయాలో తెలియడం లేదని జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. దీని నిర్మాణానికి 500 కోట్లకు పైగానే ప్రజా ధనం వెచ్చించారని తెలిపారు. విశాఖలో సేనతో సేనాని కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో తాజాగా పవన్ కల్యాణ్ రుషికొండను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన.. ప్యాలెస్లోని ప్రతి గదినీ పరిశీలించారు.
అనంతరం.. మాట్లాడుతూ.. ప్యాలెస్లోని రెండు బ్లాక్ ల నిర్మాణానికి 90 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు. ఇక, ప్రధాన బ్లాక్ను 70 కోట్ల వ్యయంతో నిర్మించారన్నారు. మొత్తం ఏడు బ్లాకులుగా దీనిని నిర్మించాలని ప్లాన్ చేశారని, కానీ, 4 మాత్రమే నిర్మించారని చెప్పారు. ఈ 4 బ్లాకులతోకే 454 కోట్లను ఖర్చు చేశారని, మిగిలిన వాటికి అంచనాలు లేవని వ్యాఖ్యానించారు. ప్రజాధనాన్ని వృథా ఎలా చేయొచ్చో.. వైసీపీ పాలనను చూస్తే అర్థం అవుతుందని విమర్శించారు.
“గతంలో మమ్మల్ని రానివ్వలేదు… ఎన్నో అడ్డంకులు సృష్టించారు. గతంలో రిసార్ట్స్ ఉన్నప్పుడు సంవత్సరానికి 7 కోట్లు ఆదాయం ఉండేది. ప్రస్తుతం కేవలం కరెంట్ బిల్లు కట్టడానికి సంవత్సరానికి 15 లక్షలు అవుతోంది. దీనిని చెల్లిస్తున్నాం. మిగతా వాటికోసం ఇంకా మాట్లాడనవసరం లేదు, ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. లోపల పెచ్చులు ఉడిపోతున్నాయి కొన్ని చోట్ల లీకేజ్ అవుతోంది. “ అని పవన్ వ్యాఖ్యానించారు.
అప్పటి సీఎం జగన్ ఇక్కడ నివాసం ఉండేందుకు.. ఈ ప్యాలెస్ను నిర్మించుకున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఒక ముఖ్యమంత్రి నివాసానికి 500 కోట్లు వెచ్చించడం ఎక్కడా లేదన్నారు. ఇక, ఇప్పుడు ఈ ప్యాలెస్ను పర్యాటక ప్రాంతంగా మార్చాలని ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. అయితే.. ఇలా చేస్తే ఆదాయం వస్తుందా? రాదా? అనేది డోలాయమానంగా ఉందన్న పవన్ కల్యాణ్.. మేజర్ గా ఈ నిర్మాణాన్ని ఎలా ఉపయోగించాలో ఆలోచన చేస్తున్నామన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates