త్రిముఖ వ్యూహం: టీడీపీ గ్రాఫ్ పైపైకి ..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. యువ‌త‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. పార్టీలో కీల‌క ప‌ద‌వులను యువ‌త‌కు అప్ప‌గించ‌డం ద్వారా.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు యుద్ధాన్ని ఇప్ప‌టి నుంచే ప్రారంభించాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌స్తుతం ఉన్న అంచనాల ప్ర‌కారం.. పార్టీలోని 40 శాతం మంది యువ‌త‌కు అవ‌కాశాలు ఇవ్వ‌నున్నారు. జిల్లాల వారీగా యువ‌త‌ను ప్రోత్స‌హించ‌డం ద్వారా.. పార్టీలో యువ నాయ‌క‌త్వాన్ని పెంచాల‌ని యోచిస్తున్నారు. ఈ క్ర‌మంలో మూడు ప్ర‌ధాన అంశాల‌ను లెక్క‌లోకి తీసుకుంటున్నారు.

1) వివాద ర‌హితులు: పార్టీలో చేర్చుకునే నాయ‌కులు, లేదా ఉన్న నాయ‌కులు.. 30-45 ఏళ్లలోపు వారై ఉండి.. వివాదాల‌కు దూరంగా ఉన్న‌వారిని ఎంపిక చేయాల‌ని చంద్ర‌బాబు తాజాగా ఆదేశించారు. అంతేకాదు.. పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం వినిపించేవారు కావాల‌ని కోరుకుంటున్నారు. ఇక‌, పార్టీ ప‌రంగా అంకిత భావంతో ప‌నిచేసేవారి కోసం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక‌, ఉన్న‌త స్థాయి విద్యావంతులు అయితే.. మ‌రింత హుందాగా రాజ‌కీయాలు చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్న భావ‌న‌తోనూ ఉన్నారు.

2) చురుకైన‌యువ‌త‌రం: పార్టీలో ప్ర‌స్తుతం ఉన్న యువ నాయ‌కుల్లో చురుకున్న వారి కంటే కూడా దూకుడు ఎక్కువ‌గా ఉన్న వారు క‌నిపిస్తున్నారు. వీరివ‌ల్ల వివాదాల‌కు కేంద్రంగా పంచాయ‌తీల‌కు అవ‌కాశం ఇచ్చేలా పార్టీ మారిపోయింది. ప‌లు జిల్లాల నుంచి రోజూ.. ఏదో ఒక స‌మ‌స్య తెర‌మీదికి వ‌స్తూనే ఉంది. ఈ నేప‌థ్యంలో యువ‌త‌లో చురుకుత‌నం ఉండి.. వివాదాల‌కు క‌డు దూరంగా ఉండే నాయ‌కులు అయితే బెస్ట్ అని చంద్ర‌బాబు అంచ‌నా వేస్తున్నారు.

3) సామాజిక వ‌ర్గం: సాధార‌ణంగా పార్టీల‌లో ప‌ద‌వులు అంటే.. సామాజిక వ‌ర్గాల వారీగానే కేటాయింపులు.. భ‌ర్తీలు జ‌రుగుతాయి. ఇప్పుడు టీడీపీలోనూ అదే సోష‌ల్ ఇంజ‌నీరింగ్ చేయాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. అయితే.. పూర్తిగా గుండుగుత్త‌గా ఒకే వ‌ర్గానికి కాకుండా.. టాలెంట్ బేస్డ్ యూత్‌ను ప్రోత్స‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్యం ఇస్తూనే టాలెంట్‌కు పెద్ద పీట వేయాల‌ని భావిస్తున్నారు. మొత్తంగా త్రిముఖ వ్యూహంతో టీడీపీని బ‌లోపేతం చేయాల‌ని నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం.