సోనియా నివాసం హైదరాబాద్ కు మారుతుందా ?

అనారోగ్య కారణాల వల్ల కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధి ఢిల్లీ మకాం ను తాత్కాలికంగా గోవాకు తరలించారు. చాలా కాలంగా సోనియా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన తీవ్రమైనపోయిన నేపధ్యంలో అర్జంటుగా ఆమెను తాత్కాలికంగా ఢిల్లీ నుండి షిఫ్టు చేయాల్సిన అవసరం వచ్చింది. ఇందుకు రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటిదేమో ఢిల్లీలో పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసుల తీవ్రత. ఇక రెండోదేమో ఢిల్లీలో పెరిగిపోతున్న వాయుకాలుష్యం. ఈ రెండు సమస్యలు కూడా ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారికి చాలా ప్రమాదకరమని కొత్తగా చెప్పక్కర్లేదు.

కరోనా వైరస్ వల్ల చనిపోతున్న వాళ్ళల్లో అత్యధికం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్లే. ఇక వాయుకాలుష్యం వల్ల కూడా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. ఇప్పటికే సోనియా క్యాన్సర్ ట్రట్మెంట్ కూడా చేయించుకుంటున్నారనే వార్తలు వింటున్నాం. ఇందుకోసం తరచూ విదేశాలకు వెళ్ళి చికిత్స చేయించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ పరిస్దితుల్లో ఢిల్లీలో ఉండటం కాంగ్రెస్ చీఫ్ కు ఎంతమాత్రం సేఫ్ కాదని డాక్టర్లు సలహా ఇచ్చారు. అందుకనే ప్రస్తుతం గోవాకు తాత్కాలికంగా షిఫ్టు అయ్యారు. ఉత్తరాధిలో ప్రస్తుతం చలి వాతావరణం ఉంటుంది. చాలా ప్రాంతాల్లో వాతావరణం రోజూ ఒకేలాగుండదు. ఇది మరిన్ని సమస్యలకు దారితీస్తుంది.

అందుకనే దక్షిణాది రాష్ట్రాలే సేఫ్ అని సోనియా కుంటుంబం అనుకున్నదట. అయితే దక్షిణాదిలో కూడా సమస్యలున్నాయి. అవేమిటంటే గోవా, చెన్నై వాతావరణం కూడా అంత బాగుండదు. పైగా రెండు కూడా సముద్రతీరాలే. విపరీతమైన చెమటలు పడుతుంటాయి. అసలే అనారోగ్యంతో ఉన్న సోనియాకు ఈ వాతావరణం కూడా అంతగా సూట్ అయ్యే అవకాశాలు లేవు. అందుకనే సెకండ్ ఆప్షన్ క్రింద హైదరాబాద్ ను పరిశీలిస్తున్న పార్టీ వర్గాలు చెప్పాయి.

దేశం మొత్తం మీద ఎవరికైనా సరిపడే వాతావరణం ఉండేది ఒక్క హైదరాబాద్ లో మాత్రమే. పైగా ప్రపంచప్రఖ్యాత ఆసుపత్రులు కూడా ఉన్నాయి. కాబట్టి ఎటువంటి హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా ఇబ్బందులుండవు. ఇదే సమయంలో దేశ, విదేశాలకు బయలుదేరేందుకు అవసరమైన అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ కూడా ఉంది. ఎక్కువ రోజులు విశ్రాంతి అవసరమని అనుకుంటే మాత్రం గోవా కన్నా హైదరాబాదే మంచి ప్లేసని సోనియా కుటుంబానికి బాగా సన్నిహితులు సూచించారట. కాబట్టి సోనియా తాత్కాలిక నివాసం హైదరాబాద్ కు మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది సమాచారం. చూద్దాం మరి సోనియా కుటుంబం ఏమాలోచిస్తుందో.