వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్పై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మోడీ ఫేవరెట్ అని వ్యాఖ్యానించారు. ముసుగు తీసేశారని, ఆయన వైఖరి తెలుగు జాతికి ద్రోహం చేసేలా ఉందని తీవ్రంగా స్పందించారు. ఇప్పటి వరకు ముసుగు వేసుకుని యుద్ధం చేస్తున్నట్టు నటించారని, ఇప్పుడు ఆ ముసుగు తొలగించారని అన్నారు. తెలుగు వారు జగన్ను ఎలా నమ్మాలని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి వారు రాజకీయాలకు అవసరమా అని అన్నారు.
ఏం జరిగింది?
ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నామినేషన్ ప్రక్రియ గురువారం పూర్తికావడంతో అటు ఎన్డీయే తరఫున నామినేషన్ వేసిన సీపీ రాధాకృష్ణన్, ఇటు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి తరఫున నామినేషన్ దాఖలు చేసిన జస్టిస్ బీ. సుదర్శన్ రెడ్డి కూడా తమ తమ మద్దతుదారులను కలుసుకుని ఓటు వేసేలా అభ్యర్థించనున్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీలకు చెందిన రాష్ట్ర, కేంద్ర స్థాయి నాయకులు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.
ఇక ఇప్పటికే తమ మద్దతు ఎవరికనే విషయంపై ఏపీలో రెండు ప్రధాన పార్టీలు కూడా ప్రకటించాయి. ఎలానూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నేతలు సీపీ రాధాకృష్ణన్కే మొగ్గు చూపుతారు. కానీ విపక్ష వైసీపీ కూడా ఈయనకే మద్దతు ఇస్తోంది. ఈ విషయాన్ని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
ఈ విషయాన్ని కోట్ చేస్తూ షర్మిల జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ప్రజల పక్షం కాదని, మోడీ పక్షమని, ఇప్పటి వరకు ముసుగు వేసుకుని ఎన్డీయేకు మద్దతు ఇచ్చారని అన్నారు. ఇప్పుడు ఆ ముసుగు కూడా తీసేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు జాతికి ద్రోహం
తెలుగు వారైన సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకుండా, తెలుగు జాతికి జగన్ ద్రోహం చేశారని అన్నారు. జగన్ను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ఓటు చోరీ జరిగిందని గగ్గోలు పెడుతున్న జగన్, ఆ చోరీకి కారకులైన బీజేపీకి ఎలా మద్దతు ఇస్తారని నిలదీశారు. ద్వంద్వ వైఖరి, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న జగన్ను ఎవ్వరూ నమ్మొద్దని ఆమె పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates