సొంత పార్టీలోని కొందరు నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొద్ది రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ కు తాను రాసిన లేఖ లీక్ కావడంపై కవిత అసహనం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఇక ఆ లేఖలో కవిత పేర్కొన్న విషయాలు పార్టీలోని అంతర్గత కలహాలకు అద్దంలా మారాయి. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించేలా ఉన్న ఆ లేఖ బీఆర్ఎస్ వర్గాల్లో దుమారం రేపింది. ఆ లేఖ తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు కవితతో అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీలోని కొందరు కుట్రదారులు తనను రకరకాలుగా వేధిస్తున్నారని కవిత షాకింగ్ కామెంట్లు చేశారు. ఆ కుట్రదారులను బయటపెట్టాలని కోరితే తనపై కక్షగట్టారని వాపోయారు. ఆ కుట్రదారులే ఆ లేఖను తాను అమెరికా వెళ్లిన సమయంలో లీక్ చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసని అన్నారు. తాను అమెరికాలో ఉన్నప్పుడే గౌరవ అధ్యక్ష ఎన్నిక జరిగిందని, చట్టవిరుద్ధంగా బీవీజేకేఎస్ సమావేశం నిర్వహించి ఎన్నుకున్నారని కవిత ఆరోపించారు. కార్మికుల చట్టాలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారని ఆరోపించారు.
సింగరేణి కార్మికుల కోసం తాను పోరాడుతుంటే తనపై కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ ప్రకారం సింగరేణి గని కార్మికులకు కవిత బహిరంగ లేఖ రాశారు. టీవీజేకేఎస్ గౌరవాధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్ కు శుభాకాంక్షలు తెలిపారు. మరి కవిత కామెంట్లపై బీఆర్ఎస్ నేతల రియాక్షన్ ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates