అధికారులూ.. బాబు చెప్పింది వినిపిస్తోందా?

నాయకులు, ప్రజాప్రతినిధులు ఇటీవ‌ల కాలంలో సీఎం చంద్ర‌బాబు చెప్పిన మాట‌ల‌ను పెడ‌చెవిన పెడుతున్నారు. వీరి సంగ‌తి ఎలా ఉన్నా, ఉన్న‌త‌స్థాయిలో ఉన్న అధికారులు కూడా కొంద‌రు సీఎం చంద్ర‌బాబు చెప్పింది ఒక‌టైతే, వారు అర్థం చేసుకుంటున్న‌ది మ‌రొక‌టి. దీంతో సీఎం చంద్ర‌బాబు ఆలోచ‌న‌లు ఎలా ఉన్న‌ప్ప‌టికీ, క్షేత్ర‌స్థాయిలో మాత్రం ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీనిపై సీఎం కూడా దృష్టి పెట్టారు. గ‌తంలో ఇసుక‌, త‌ర్వాత మ‌ద్యం, ఇప్పుడు పీ-4 విష‌యంలోనూ అధికారుల తీరుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీంతో తాజాగా జ‌రిగిన పీ-4 ప్రారంభ కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

పీపుల్-ప‌బ్లిక్-ప్రైవేట్-పార్ట‌న‌ర్‌షిప్ (పీ4) కార్య‌క్ర‌మాన్ని కూట‌మి ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. సీఎం చంద్ర‌బాబు దీనిపై ప్ర‌త్యేక క‌స‌ర‌త్తే చేస్తున్నారు. వ‌చ్చే 2029 నాటికి 20 ల‌క్ష‌ల పేద కుటుంబాల‌ను పేద‌రికం నుంచి బ‌య‌ట‌కు తీసుకురావాల‌న్న‌ది ఈ కార్య‌క్ర‌మం ప్ర‌ధాన ల‌క్ష్యం. దీనికి త‌గ్గ‌ట్టుగానే చంద్ర‌బాబు ముందుకు సాగుతున్నారు. తాజాగా నిర్వ‌హించిన పీ-4 అమ‌లు కార్య‌క్ర‌మంలో తాను కుప్పంలో ద‌త్త‌త తీసుకున్న కుటుంబాల్లోని కొంద‌రిని మంగ‌ళ‌గిరికి తీసుకువ‌చ్చి, వారిని ద‌త్త‌త తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పీ-4 పూర్తిగా స్వ‌చ్ఛంద‌మేన‌ని, దీనిని బ‌ల‌వంతం గా ఎవ‌రిపైనా రుద్దే ప్ర‌య‌త్నం చేయ‌బోమ‌ని అన్నారు. అంతేకాదు, ఎవ‌రూ కూడా దీనిపై ఇబ్బందులు ప‌డొద్దు, పెట్టొద్ద‌ని కూడా సూచించారు.

ఎందుకు?

పీ-4 అమ‌లు ప్రారంభించిన ఉగాది త‌ర్వాత, క్షేత్ర‌స్థాయిలో ఉన్న‌తాధికారుల‌కు చంద్ర‌బాబు ల‌క్ష్యాలు నిర్దేశించారు. పీ-4 ల‌బ్ధిదారులైన బంగారు కుటుంబాల‌ను గుర్తించాల‌న్నారు. అంటే అట్ట‌డుగున ఉన్న పేద‌ల‌ను గుర్తించాల‌ని ఆయ‌న సూచించారు. అదేస‌మ‌యంలో వీరిని ద‌త్త‌త తీసుకునే మార్గ‌ద‌ర్శ‌కుల‌ను కూడా గుర్తించాల‌ని సూచించారు. అయితే, అధికారులు ఎలా అర్థం చేసుకున్నారో ఏమో కానీ, క్షేత్ర‌స్థాయిలో సాధార‌ణ ఉద్యోగులు, ఉపాధ్యాయుల‌పై ఒత్తిడి తీసుకురావ‌డం ప్రారంభించారు. రూ.40 వేల వేత‌నం కంటే ఎక్కువ ఉన్న వారిని పేద‌ల‌ను ద‌త్త‌త తీసుకోవాల‌ని, పీ-4లో న‌మోదు చేసుకోవాల‌ని స‌ర్క్యుల‌ర్లు జారీ చేశారు.

ఏలూరు, తూర్పుగోదావ‌రి, విజ‌య‌న‌గ‌రం, విశాఖ జిల్లాల్లో సంయుక్త క‌లెక్ట‌ర్లు జారీ చేసిన ఈ స‌ర్క్యుల‌ర్లు తీవ్ర వివాదంగా మారాయి. అనేక మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు స‌ర్కారుపై నిప్పులు చెరిగారు. తామే ఇబ్బందుల్లో ఉన్నామ‌ని, త‌మ‌కు రావ‌ల్సిన పీఆర్సీ బ‌కాయిలు, డీఏలు ఇవ్వ‌క‌పోగా ఇప్పుడు పేద‌ల‌ను ద‌త్త‌త తీసుకోమ‌ని ఒత్తిడి చేయ‌డం ఏంట‌ని వారు వాపోయారు. ఒక‌రిద్ద‌రు ఉద్యోగులు అయితే త‌మ‌నే ద‌త్త‌త తీసుకోవాల‌ని సంయుక్త క‌లెక్ట‌ర్ల‌కు అర్జీలు స‌మ‌ర్పించారు.

ఈ నేప‌థ్యంలోనే సీఎం చంద్ర‌బాబు తాజాగా చేసిన ప్ర‌క‌ట‌నలో ఈ వ్య‌వ‌హారాన్ని ప‌రోక్షంగా ప్ర‌స్తావిస్తూ, ఎవ‌రూ ఒత్తిడి తీసుకురావ‌ద్దని, పీ-4 స్వ‌చ్ఛంద‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రి సీఎం చెప్పింది ఇప్ప‌టికైనా అధికారుల‌కు అర్థ‌మ‌వుతుందో లేదో చూడాలి.