టార్గెట్ రోజా.. ఇక యాక్షనే!

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజాకు టెన్షన్ పట్టుకుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్రంలో యువతను ప్రోత్సహించేందుకు క్రీడలు నిర్వహించారు. దీనికి సంబంధించి 150 కోట్లకు పైగా అప్పటి వైసీపీ ప్రభుత్వం కేటాయించింది. కేవలం రెండేళ్ల కాలంలో ఏడాది పాటు నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఇంత పెద్ద మొత్తం కేటాయించడం, ఈ నిధులు కూడా చాలవని అప్పులు చేయడం వంటి విషయాలు అప్పట్లో విమర్శలకు దారితీశాయి.

పైగా ఆడుదాం ఆంధ్ర పేరుతో కొన్ని క్రీడా పరికరాలు కొనుగోలు చేశారు. వీటికి సంబంధించిన కాంట్రాక్టులను అనుకూల సంస్థలకు ఇచ్చారన్న ఫిర్యాదులు, ఆరోపణలు కూడా వచ్చాయి. మొత్తం 150 కోట్లలో 60-70 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని అప్పట్లో టీడీపీ నాయకులు ఆరోపించారు. విద్యార్థులకు, యువ క్రీడాకారులకు ఇచ్చిన క్రీడా పరికరాల్లో నాణ్యత లేకపోవడం, క్రికెట్ బ్యాట్లు విరిగిపోవడం, నాసిరకమైన పరికరాలు పంపిణీ చేశారని కూడా విమర్శలు వచ్చాయి.

అదేవిధంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడల ప్రారంభోత్సవం, ముగింపుల సందర్భంగా నిర్వహించిన సభలు, సమావేశాలకు భారీ ఎత్తున ఖర్చు చేశారని, నైపుణ్యం లేని క్రీడాకారులకు కూడా వేల రూపాయల నగదును పంపిణీ చేశారని ఆరోపణలు వచ్చాయి. వీటిపై తరచుగా టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నాలుగు నెలల క్రితం ఆడుదాం ఆంధ్ర పరికరాల కొనుగోలు, కార్యక్రమాల నిర్వహణపై విచారణకు ఆదేశించింది.

విజిలెన్స్ అధికారులు దీనిపై దృష్టి పెట్టి పలు రూపాల్లో విచారణ చేశారు. తాజాగా తమ నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించారు. దీనిపై మరో అధ్యయనం అనంతరం ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధానంగా మంత్రి రోజాకు 50 కోట్ల వరకు ముడుపులు ముట్టాయని వాదనలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా అప్పట్లో షాప్ చైర్మన్‌గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కూడా 10-20 కోట్ల సొమ్ము చేరిందని టీడీపీ నాయకులు అంటున్నారు.