ఎస్‌.. మనం కూడా: జగన్ కీలక నిర్ణయం..!

రాజకీయాల్లో ఒకరిని అనుసరించడం తప్పుకాదు. తమకు అనుకూలంగా ఉంటే, ఎవరు దేనినైనా అనుసరిస్తారు. అనుకరిస్తారు కూడా. ఈ క్రమంలో తాజాగా వైసీపీ కూడా కాంగ్రెస్ పార్టీని అనుసరించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ఒకే ఇంటి నెంబరుతో వేలాది ఓట్లు వేయించారని, ఒకే వ్యక్తి పేరుతో వేల ఓట్లు సృష్టించారని కూడా ఆరోపిస్తున్నారు.

కర్నాటకలోని మహదేవపుర నియోజకవర్గంలో జరిగిన ఓటింగ్‌పై రాహుల్ వివరించారు. కట్ చేస్తే, ఇప్పుడు జగన్ కూడా ఇదే విషయంపై దృష్టి పెట్టారు. వాస్తవానికి గత ఏడాది జరిగిన ఎన్నికల తర్వాత, జగన్ మీడియాతో మాట్లాడుతూ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, వీటిపై ఆయన పోరాడతానని ఎప్పుడూ చెప్పలేదు. ఒక్క ఒంగోలులో మాత్రం అప్పటి అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రమే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈవీఎంలను తిరిగి లెక్కించాల‌ని కోరారు. ఇది పెద్దగా ఫలించలేదు.

కానీ, ఇప్పుడు రాహుల్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత, జగన్ కూడా త్వరలోనే ఏపీలో జరిగిన ఎన్నికలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక, గత ఎన్నికల తీరుపై అధ్యయనం చేసేందుకు, మస్తాన్ రావు సహా మద్రాస్ ఐఐటీకి చెందిన ఎన్నికల నిపుణుడిని నియమించుకుని అధ్యయనం చేయించాలని నిర్ణయించుకున్నారు. ప్రధానంగా 50 వేల‌కు మించి మెజారిటీ వచ్చిన నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళిని అధ్యయనం చేయనున్నట్టు పార్టీ కీలక నాయకుడు ఒకరు తెలిపారు.

“జరిగిన దానికి మేం ఇప్పుడు ఏం చేయలేం. కానీ, ఈ అధ్యయనం చేయడం ద్వారా మేం రెండు విషయాలను ప్రజల ముందు పెట్టాలని అనుకున్నాం. 1) ఈవీఎం ద్వారా ఓటింగ్ వద్దనే విషయాన్ని ప్రజల నుంచే వినిపించేలా చేయాలని భావిస్తున్నాం. 2) తప్పులను ప్రజలకు వివరించనున్నాం. ఈ రెండు అత్యంత వేగంగా జరగనున్నాయి,” అని సదరు నాయకుడు వివరించారు. నిజానికి ఇప్పుడే చేయాల్సిందని సదరు నాయకుడు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జగన్ దీనిపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారని సమాచారం.