ప్రస్తుత కూటమి ప్రభుత్వ దూకుడు, అమలు చేస్తున్న సంక్షేమం, బలమైన గళం వినిపిస్తున్న నాయకులు ఒకవైపు. సైలెంట్గా వ్యవహరిస్తున్న నేతలు, అధినేతపైనే విమర్శలు చేస్తున్న నాయకులు, పార్టీ కార్యక్రమాలకు కడుదూరంగా ఉంటున్న సీనియర్లు మరోవైపు. ఇదే ఇప్పుడు ఏపీలో టీడీపీ, వైసీపీల్లో స్పష్టంగా కనిపిస్తున్న రాజకీయం. చంద్రబాబు చెబుతున్న మాటను కొందరు పక్కన పెట్టేస్తున్నా, చాలా మంది మాత్రం ఫాలో అవుతున్నారు. స్థానికంగా పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
దీంతో మెజారిటీ నియోజకవర్గాల్లో వైసీపీ దూకుడుకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఇక వైసీపీ తరఫున బలమైన గళం వినిపించేవారు, పార్టీ తరఫున పనిచేసేవారు పెద్దగా కనిపించడం లేదు. ఈ పరిణామాలతో టీడీపీకి ఉన్న పాజిటివిటీ వైసీపీకి లభించడం లేదు. ఒకప్పుడు “తామే ముందు” అని చెప్పుకొన్న నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు వైసీపీ మైనస్ అయిపోయింది. కనీసం జెండా కట్టే కార్యకర్తలు, మోసే కార్యకర్తల కోసం కూడా వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. అధినేత మాటలను లైట్ తీసుకుంటున్నారు.
ఫలితంగా ఇప్పటి వరకు నాలుగు రూపాల్లో వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపులు, నిరసనలు చేపట్టాలంటూ నాయకులకు చేసిన దిశానిర్దేశాలు అన్నీ బుట్టదాఖలయ్యాయి. కొన్నినియోజకవర్గాల్లో అయితే అసలు నాయకులు ముందుకు కూడా రాలేదు. ఈ పరిణామాలు పార్టీ అస్తిత్వంపై పెను ప్రభావం చూపిస్తున్నాయన్నడంలో సందేహం లేదు. ఎవరికి వారు సొంతగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వైసీపీ “బ్యాక్ బెంచ్” ఏనే అనే టాక్ జోరుగా వినిపిస్తోంది.
మూడు పార్టీల కలివిడి క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నప్పటికీ పై స్థాయిలో మాత్రం బాగానే ఉందని స్పష్టంగా తెలుస్తోంది. దీంతో క్షేత్రస్థాయిలో నాయకులు కూడా సర్దుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం కూటమికి కలిసి వస్తోంది. కానీ వైసీపీకి మాత్రం అధినేత విషయంలోనే అసలు సమస్య ఏర్పడింది. ఆయన ఇప్పటికీ తమకు అప్పాయింట్మెంటు ఇవ్వడం లేదని సీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు నాయకులు చెబుతున్నారు. ఈ పరిస్థితి మారనంత వరకు తాము సహకరించేది లేదన్నట్టుగా ఉన్నారు. మరి వైసీపీ అధినేత జగన్ ఈ పరిణామాలను మార్చకపోతే, తాను జోక్యం చేసుకుని కలివిడిగా ఉండకపోతే ఆ పార్టీ ఎప్పటికీ బ్యాక్ బెంచ్లోనే ఉంటుందన్నది పరిశీలకులు సైతం అంచనా వేస్తున్న విషయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates