
గిరిజనులు, ఆదివాసీలను వైసీపీ ఓటు బ్యాంకుగా మార్చిందని.. వారిని ఓటు బ్యాంకుగానే చూసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. శనివారం.. జన జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజనులతో ఆయన ముచ్చటించారు. తొలుత గిరిజనుల సంప్రదాయ నృత్యాలను తిలకించారు. కొమ్ములతో చేసిన తలపాగాను ధరించారు. వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఆదివాసీలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గిరిజనులు అంటే.. ఊరికి దూరంగా ఉంటారని.. కానీ, వారి మనసులు మాత్రం ఎప్పుడూ ప్రజలకు దగ్గరగా ఉంటాయన్నారు. గిరిజనుల సంపద పెంచేందుకు తమ ప్రభుత్వం గిరిజన ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గిరిజనుల ఆదాయం పెంచితే.. అది వారిని సామాజికంగానే కాకుండా.. వ్యక్తిగతంగా కూడా అభివృద్ధిలోకి తీసుకువస్తుందన్నారు.
గిరిజనులకు ఉన్న ప్రత్యేక చట్టాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చంద్రబాబు విమర్శించారు. వారిని ఓటు బ్యాంకుగానే చూశారని, వారిని కూడా తమ రాజకీయం కోసం వాడుకున్నారని దుయ్యబట్టారు. గిరిజనులను ప్రోత్సహించి కొందరు వైసీపీ నాయకులు గంజాయి సాగును ఒక కుటీర పరిశ్రమను చేశారని.. కేసులు ఎదుర్కొనే సమయానికి గిరిజనులను ఇరికించారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ఎవ్వరూ గంజాయి జోలికి పోకుండా.. అనేక పంటలు పండించేలా ప్రభుత్వం మార్గదర్శనం చేస్తోందని చంద్రబాబు చెప్పారు.
ఏజెన్సీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా.. రహదారుల నిర్మాణం చేపడుతున్నామని.. భవిష్యత్తులో గిరిజనులకు.. బస్సులు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. గిరిజనుల ఉత్పత్తులకు ప్రపంచ ప్రఖ్యాతి తీసుకువస్తున్నామని.. దీనికి అరకు కాఫీనే ఉదాహరణని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ తీసే తేనెకు కూడా ప్రాచుర్యం కల్పిస్తామని చెప్పారు.

Gulte Telugu Telugu Political and Movie News Updates