వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నానిని ఇప్పుడప్పుడే కేసులు వదిలేలా లేవు. ఇప్పటికే నాని ప్రాతినిధ్యం వహించిన గుడివాడ కేంద్రంగా పలు కేసులు నమోదు కాగా…గుండె సంబంధిత వ్యాధి, దానికి చికిత్స, ముంబైలో ఆపరేషన్ తదితర కారణాలతో జైలు నుంచి తప్పించుకున్నారన్న వాదనలు ఉన్నాయి. అయితే తాజాగా నానిపై మరో కేసు నమోదు అయ్యింది. అది కూడా విశాఖపట్నంలో నమోదు కావడం గమనార్హం.
విశాఖలో నమోదు అయిన ఈ తాజా కేసు విషయానికి వస్తే… వైసీపీ అధికారంలో ఉండగా ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ లపై నాని నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పాలిటిక్స్ లో సీనియర్ మోస్ట్ అయిన చంద్రబాబుపై, ఆయన కుమారుడిపై నాని పరుష పదజాలంతో విరుచుకుపడటాన్ని భరించలేని న్యాయ విద్యార్థి అంజనప్రియ విశాఖ త్రీటౌన్ పీఎస్ లో 2024లోనే ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా నానిపై నాడే ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజాగా ఈ కేసు బూజు దులిపిన విశాఖ పోలీసులు ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడలోని నాని ఇంటికి వచ్చారు. ఈ కేసు విచారణకు హాజరు కావాలంటూ నానికి వారు నోటీసులు జారీ చేశారు. 41 సీఆర్పీసీ కింద ఇచ్చిన ఈ నోటీసుల ఆధారంగా నాని తప్పనిసరిగా విశాఖ త్రీటౌన్ పీఎస్ కు వెళ్లి విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తనకున్న అనారోగ్య సమస్యను సాకుగా చూపి ఆయన మరోమారు కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్లు సమాచారం. ఏది ఏమైనా నాని ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయనను కేసులు మాత్రం వీడేలా లేవని మాత్రం చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates