తెలంగాణ మంత్రి జూపల్లి కృష్నారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేత, ఎంపీ మల్లు రవి కూడా హాజరయ్యారు. అయితే.. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో జరిగిన ఓ చిన్న ఘటన.. ఆయనను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. దండు నరసింహ అనే కార్యకర్త.. వేదికపైకి వచ్చి.. మైకులో ప్రసంగిస్తున్న మల్లు రవికి ఓ కాయితం అందించారు. దీనిని చూచాయగా చూసిన రవి.. వెంటనే ఆ కాయితాన్ని నరసింహపై విసరి కొట్టారు. అంతేకాదు.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కృష్ణారావును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
ఇంతకీ సదరు కాయితంలో ఏముందంటే.. “మాట్లాడడానికి ఎక్కువ మంది నాయకులు ఎదురు చూస్తున్నారు. మీరు త్వరగా ముగించండి.” అని ఉంది. దీనిని చూసిన వెంటనే ఎంపీ రవి అగ్గిమీద గుగ్గిలంలా మండి పడ్డారు. ఒకవైపు నరసింహను తిట్టి పోస్తూనే.. మరోవైపు “నువ్వు పెట్టే చికెన్ కూర, చేపల ఫ్రై తినడానికి, సొల్లు చెప్పడానికి రాలేదు.. ప్రజలకు మంచి చేస్తామని చెప్పడానికి వస్తే తొందరగా ముగించమంటారా?” అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావుపై మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. “నేను సొల్లు చెప్పడానికి రాలేదు.. ప్రజలకు మంచి చేస్తామని చెప్పడానికి వస్తే తొందరగా ముగించమంటారా?” అని అసహనం వ్యక్తం చేశారు.
“జూపల్లి కృష్ణారావు పెట్టే చికెన్ కూర, చేపల ఫ్రై తినడానికి రాలేదు.. ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చాను. నేను మాట్లాడుతుంటే ఆపమంటారా” అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావుపై పదే పదే మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే.. నియోజకవర్గంలో అనేక పనులు జరుగుతున్నాయని చెప్పారు. మన పార్టీ గురించి మనం చెప్పుకోకపోతే.. వేరేవారు వచ్చి చెబుతారా? అని ప్రశ్నించిన రవి.. జూపల్లి కోసం.. ఢిల్లీలో తాను కన్వీనర్గా ఉన్న న్యాయ సభకు కూడా వెళ్లకుండా వదిలేసి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం.. మరికొద్ది సేపు ప్రసంగించారు. అయితే.. ఇకపై.. తాను కూడా నిర్దిష్ట సమయం ప్రకారమే మాట్లాడతానని చివరలో చెప్పడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates