ఏపీలో పెట్టుబడి దారులకు దాదాపు రెడ్ కార్పెట్ పరిచినట్టే అయింది. ఇప్పటి వరకు కొందరు పెట్టుబడి దారులు.. విపక్షాలు సహా.. ఇతర ఉద్యమ కారుల విషయంలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు కల్పించే మౌలిక వసతులపై.. యాగీ చేస్తారని.. ముఖ్యంగా భూములు.. ఇతరత్రా కీలక విషయాల పై తమకు ఇబ్బందులు వస్తాయని భావించారు. సహజంగా ఇప్పటి వరకు జరిగింది అదే. దీంతో ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు కూడా.. వెనక్కి తగ్గిన పరిస్థితి ఉంది.
ఇది పెట్టుబడులపై తీవ్ర ప్రభావమే చూపించింది. అయినా.. చంద్రబాబు పెట్టుబడి దారులను ఆహ్వానిస్తున్నారు. విమర్శలు, ఉద్యమాలకు కూడా లెక్కచేయకుండా రాష్ట్ర భవితవ్యం దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు.. పెరుగుతున్న జనాభాకు తగిన విధంగా పారిశ్రామికీకరణ.. వనరుల పెంపు.. వంటి అంశాలపై దృష్టి పెడుతున్నారు. అయినా.. విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే.. తాజాగా ఏపీ హైకోర్టు సర్కారు అండగా నిలిచింది.
పెట్టుబడి దారులకు ఇచ్చే భూముల విషయంలో సందేహాలు ఎందుకని ప్రశ్నించడంతోపాటు.. ఏమీ ఇవ్వకుండా పెట్టుబడి దారులు ఎలా వస్తారని కూడా నిలదీసింది. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు డెవలప్ కావడానికి గతంలో పెట్టుబడి దారులకు భూములు కేటాయించి.. వనరులు కల్పిస్తేనే కదా సాధ్యమైంది? అని ప్రశ్నించింది. దీంతో సర్కారుకు పెద్ద ఎత్తున ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చింది. ప్రస్తుతం విశాఖలో టీసీఎస్ సహా లులు మల్టీ చైన్ కంపెనీలకు భూములు కేటాయించారు.
అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కర్రేడు గ్రామంలో సౌర విద్యుత్ ప్లాంటుకు భూములు ఇచ్చారు.(ఇది తీవ్ర వివాదంగా ఉంది), విజయవాడలోని పాత బస్టాండ్ను లులు మాల్కు కేటాయించనున్నారని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా రాజధాని విస్తరణకు మరో 44 వేల ఎకరాలను పూలింగ్ విధానంలో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో.. ఇప్పుడు వీటి విషయంలో ప్రభుత్వం ధైర్యంగా ముందుకు సాగేందుకు అవకాశం ఏర్పడింది. వీటిపై రేపు న్యాయపరమైన వివాదాలు తలెత్తినా.. హైకోర్టు ఉత్తర్వులు ప్రభుత్వానికి కలిసి రానున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates