జ‌గ‌న్‌కు ష‌ర్మిల నుంచి మ‌రింత కాక‌.. !

రాజకీయాల్లో ఒక పరిణామానికి మరికొన్ని పరిణామాలు కారణాలు అవుతాయి. ఉదాహరణకు చంద్రబాబుపై నమోదు చేసిన కేసు వైసీపీ హయాంలో ఆయనను జైలుకు పంపించిన తీరు వంటివి మేలు చేస్తాయని జగన్ భావించగా అవి మేలు చేయకపోగా సమాజంలోని రెండు మూడు సామాజిక వర్గాలను ఏకం చేశాయి. అంటే ఒక అరెస్టు కారణంగా అనేక మార్పులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇది అంతిమంగా జగన్కు నష్టాన్ని చేకూర్చింది. ఇలా ఒక విషయానికి సంబంధించి ఇతర కారణాలు ముడిపడి కార్యా కారణ సంబంధంగా ఏర్పడే పరిస్థితులను రాజకీయాల్లో భరించటం, నెగ్గుకు రావడం చాలా కష్టం.

ఇప్పుడు తాజాగా జగన్‌కు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. కుటుంబానికి సంబంధించిన వ్యాపారాల విషయంలో సరస్వతీ పవర్ కంపెనీకి సంబంధించిన వాటాల కేసులో జగన్‌కు అనుకూలంగా హైదరాబాదులోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ల్ తీర్పు ఇచ్చింది. వాస్తవానికి దీనిని కేసుగా పరిగణించి ఉంటే జగన్ ఇందులో పైచేయి సాధించారనే చెప్పాలి. తన వాదనను బలంగా వినిపించడంతో ట్రైబ్యునల్ దానిని అంగీకరించి తీర్పు విలువరించిందని భావించాలి. కానీ దీని వెనుక చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు కార్యాకారణ సంబంధం గా ఏర్పడిన వివాదాలు చూస్తే ఈ తీర్పు కూడా వివాదానికి, రాజకీయ విభేదాలకు దారి తీసే పరిస్థితి కనిపిస్తోంది.

షర్మిల, విజయమ్మల‌కు త‌న‌ ఆస్తుల్లో వాటా ఇవ్వాల్సి ఉంటుందన్న ఉద్దేశంతోనే జగన్ కోర్టుకు ఈడ్చారని పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో దుమారం రేగిన విషయం తెలిసిందే. దీనిపై అటు మీడియాలోనూ, రాజకీయంగా కూడా జగన్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా సోదరి షర్మిల తన పిల్లలకు సంబంధించిన వాటాలు సొంత అన్నయ్య లాగేసుకున్నాడని ప్రచారం చేశారు. దీనిలో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత అనేది పక్కన పెడితే రాజకీయంగా మాత్రం తీవ్ర దుమారం రేపింది. ఇక జగన్ తన తల్లి చెల్లిని మోసం చేశారంటూ ప్రత్యర్ధులు ఎలానో ప్రచారం చేశారు.

ఇది కూడా వ్యక్తిగతంగా జగ‌న్‌కు ఇబ్బందికర పరిస్తితిని కల్పించింది. తాజాగా కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పైగా జగన్‌కు అనుకూలంగా వచ్చిన సమయంలో ఇప్పటికిప్పుడు నోరు మెదపకపోయినా భవిష్యత్తులో మాత్రం షర్మిల నుంచి జగన్‌కు మరింత సెగ తగిలే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి ఇప్పటికే టిడిపి నుంచి ఒకరిద్దరు నాయకులు జగన్ కుట్ర పన్ని కోర్టులో వాదనలు వినిపించారని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఇది వారికి సంబంధించిన విషయం కాదు. వారికి ఎటువంటి సంబంధం కూడా లేదు. అయినా జగన్ ప్రత్యర్థి కావడంతో షర్మిల వారికి అనుకూలంగా మారిన నాయకురాలిగా ఉండటం విశేషం.

ఈ తీర్పు ప్రస్తుతానికి జగన్‌కు ఆస్తుల రూపంలో కొంతమేరకు ఊరట కల్పించినా… రాజకీయంగా చూసుకున్నప్పుడు షర్మిల -జగన్‌ల‌ రాజకీయం మరింత వేడెక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇది ఎంత తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అనేది కాలమే చెప్పాలి. దీని మీద బలమైన వాయిస్ వినిపించేందుకు జగన్ సిద్ధపడితే ఆ ప్రభావం కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది, అలా కాకుండా ప్రజలు తెలుసుకుంటారు ఇదంతా ఉత్తుత్తి ప్రచారం అని అనుకుంటే గత ఎన్నికల మాదిరిగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.