వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ గురువారం నెల్లూరులో పర్యటించనున్నారు. నెల్లూరు జిల్లా సర్వే పల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం జిల్లా జైల్లో ఉన్నారు. అక్రమంగా గనులు తవ్వి సొమ్ము చేసుకున్నారన్నది ఆయనపై ఉన్న అభియోగం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలను బెదిరించారని మరో కేసు కూడా కాకాణిపై నమోదైంది. దీంతో కోర్టు ఆదేశాల ప్రకారం… కాకాణిని రిమాండు ఖైదీగా జైల్లో ఉంచారు. ఈయనను పరామర్శించేందుకు జగన్ గురువారం నెల్లూరు పర్యటన పెట్టుకున్నారు.
అయితే.. జగన్ తాడేపల్లి దాటి బయటకు వస్తే.. తమ సత్తా చూపించాలన్నది వైసీపీ నాయకుల భావన. ముఖ్యంగా జగన్ ఏ జిల్లాకు వస్తుంటే.. ఆ జిల్లా వైసీపీ నాయకులు.. హడావుడి చేయడం పరిపాటిగా మారింది. ఇది సహజంగా అన్ని పార్టీల్లోనూ ఉన్నదే. అయితే.. సమయం సందర్భం చూసుకుని నాయకులు స్పందించాల్సి ఉంటుంది. అంటే.. వెళ్తున్న కార్యక్రమాన్ని బట్టి.. నాయకులు జన సమీకరణ చేసుకోవ చ్చు. కానీ.. వైసీపీలో చావుకు-పెళ్లికి కూడా ఒక్కటే మంత్రం అన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారు.
దీంతో వివాదం అవుతోంది. పైగా పోలీసులు ముందుగానే అలెర్ట్ అయి.. నిబంధనలు పెట్టినా.. కూడా వాటిని కూడా వైసీపీ నేతలు పాటించడం లేదు. ఈ కారణంగానే రెంటపాళ్ళ ఘటన చోటు చేసుకుంది. తాజాగా నెల్లూరు పర్యటనకు సంబంధించి కూడా పోలీసులు నిబంధనలు పెట్టారు. జగన్ తాడేపల్లి నుంచి నెల్లూరులోని హెలిప్యాడ్ కు చేరుకునే సమయంలో పది మందికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. అయితే.. కనీసం 100 మందిని అనుమతించాలని.. వైసీపీ నాయకులు కోరారు.
ఇక, నెల్లూరు జైలు వద్ద యాక్ట్ 30ని అమలు చేయనున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. భారీ జనసమీకరణ చేయడానికి వీల్లేదన్నారు. సభ నిర్వహించుకోవాలని అనుకుంటే.. ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలని సూచించారు. కానీ, వైసీపీ నాయకులు మాత్రం జనసమీకరణకే మొగ్గు చూపుతున్నారు. అప్రకటిత, అనధికార రీతిలో సభను నిర్వహించేందుకే సిద్ధంగా ఉన్నారు. దీంతో నెల్లూరు పర్యటన కూడా.. సేమ్ అన్నట్టుగా మారనుంది. ఈ విషయంలో పోలీసులు పట్టుదలతో ఉండడంతో ప్రస్తుతం నెల్లూరు మొత్తం పోలీసుల అధీనంలోకి వెళ్లిపోయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates