రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థపై తరచుగా విమర్శలు గుప్పిస్తున్న మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తాజాగా మరోసారి విరుచుకుపడ్డారు. పోలీసులు కలెక్షన్ కింగ్లుగా మారిపోయారని వ్యాఖ్యానించారు. గతంలో డీఐజీ స్థాయి అధికారులు కలెక్షన్ కింగులుగా మారారన్న జగన్.. తాజాగా కానిస్టేబుల్ నుంచి హోం గార్డు వరకు కూడా అందరూ కలెక్షన్ ఏజెంట్లుగా, కింగులుగా మారారని అన్నారు. ఈ సొమ్మును కీలక నాయకుడు, ఆయన కుమారుడికి చేరవేస్తున్నారని చెప్పారు.
ఇక, మద్యం బెల్టు షాపుల కోసం టీడీపీ నాయకులే వేలంపాట వేసుకుంటున్నారని.. దీనికి పోలీసు స్టేషన్లే అడ్డాలుగా మారాయని విమర్శించారు. డీఐజీ స్థాయి అధికారులు ఈ వేలంలో పాల్గొని పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. ఇసుక, మద్యం, ల్యాండు, మైన్స్.. ఇలా అన్నింటినీ కూటమి నాయకులు దోచుకుంటున్నారని.. వ్యవస్థీకృత దోపిడీ పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. దీనిపై పోరాటం చేస్తున్నామనే.. వైసీపీ కార్యకర్తలను తీసుకువెళ్లి కొడుతున్నారని అన్నారు. కేసులు పెడుతున్నారని జగన్ చెప్పారు.
రాష్ట్రంలో రేషన్ బియ్యం మాఫియా విచ్చలవిడిగా సాగుతోందని జగన్ ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న 50 నియోజకవర్గాల్లో పేకాట క్లబ్బులు నిరంతరాయంగా నిర్వహిస్తున్నారని.. కనీసం పోలీసులు వాటిపై కన్నేసే ధైర్యం కూడా చేయలేకపోతున్నారని అన్నారు. “సూపర్ 6 అన్నాడు.. సూపర్ 7 అన్నాడు. కానీ, ఒక్కటి కూడా ఇచ్చింది లేదు. తన వారికి పప్పుబెల్లాలు మాదిరిగా.. భూములు పంచుతున్నాడు. పేదలకు గజం భూమి కూడా ఇవ్వలేదు. మనం జగనన్న కాలనీలు కట్టిస్తే.. వాటిని కూడా ఇప్పుడు రద్దు చేస్తున్నాడు“ అని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా..చంద్రబాబు పతనం ఖాయమన్న జగన్.. వైసీపీ ఎప్పుడు వస్తుందా? అని గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాతాల వరకు ప్రజలు ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ప్రజలను కలుసుకునేందుకు నాయకులు ప్రాధాన్యం ఇవ్వాలని.. కేసులకు భయపడవద్దని చెప్పారు. “మీ కష్టాలు నాకు తెలుసు. మీరు ప్రజల్లోకి వెళ్లండి. ప్రజలకు మద్దతుగా నిలవండి. ఈ ప్రభుత్వం పై ప్రజల్లోనే వ్యతిరేకత ఉంది.“ అని జగన్ చెప్పుకొచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates