సింగపూర్ తెలుగు వారిని ఒక్క‌టే కోరుతున్నా.. చంద్ర‌బాబు

“సింగ‌పూర్ తెలుగు వారిని ఒక్క‌టే కోరుతున్నా. ఒక‌ప్పుడు నేను చేసిన ఆలోచ‌న‌తోనే మీరు సింగ‌పూర్ లో సెటిల్ అయ్యేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. నేను ఎప్పుడూ.. రాబోయే 30 ఏళ్ల గురించే ఆలోచిస్తా. ఆ ఆలోచ‌నతోనే నాడు.. ఐటీకి ప్రాధాన్యం ఇచ్చాం. ఇంజ‌నీరింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చాం. ఫ‌లితంగా.. మీరంతా ఇక్క‌డ‌కు వ‌చ్చి.. మంచి మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ సెటిల్ అయ్యారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఆలోచ‌న చేస్తున్నా.. మీరు ఏపీలో పెట్టుబ‌డులు పెట్టండి. పీ-4 ప‌థ‌కంలో భాగ‌స్వాములు కండి“ అని సీఎం చంద్ర‌బాబు పిలుపు నిచ్చారు.

ఆదివారం మ‌ధ్యాహ్నం.. సింగ‌పూర్‌లోని ఓవిస్ డిజిట‌ల్ క్యాంప‌స్‌లో తెలుగు డ‌యాస్పోరా స‌మావేశం నిర్వ‌హించారు. ఎన్నారై వ్య‌వ‌హారాల స‌ల‌హాదారు డాక్ట‌ర్ వేమూరి ర‌వికుమార్ నేతృత్వంలో సింగ‌పూర్ ఎన్ ఆర్ టీ, గ‌ల్ఫ్ అధ్య‌క్షులు రాధా కృష్ణ ర‌వి సార‌థ్యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి 1500 మందిని ఆహ్వానించారు. అయితే.. మ‌రో రెండు మూడు వంద‌ల మంది అదికంగానే ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా తెలుగు వారిని ఉద్దేశించి సీఎం చంద్ర‌బాబు ప్ర‌సంగించారు.

సింగ‌పూర్‌లోని తెలుగు ప్ర‌జ‌ల ఉత్సాహం, ఆనందం.. రాష్ట్రానికి ఉప‌యోగ‌ప‌డాల‌ని సూచించారు. పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్‌లో ప‌ర్య‌టిస్తున్న‌ట్టు చెప్పారు. దీనికి తెలుగు వారు స‌హ‌క‌రించాల‌ని సూచించారు. ఒక‌ప్పుడు.. తాను ఐటీని తీసుకువ‌చ్చాన‌ని అన్నారు. ఇప్పుడు పేద‌రిక నిర్మూల‌న‌పై యుద్ధం చేస్తున్న‌ట్టు వివ‌రించారు. ఈ క్ర‌మంలోనే పీ4ను తీసుకువ‌చ్చామ‌ని.. దీనిలో సింగ‌పూర్‌లోని తెలుగు వారు కూడా చేతులు క‌ల‌పాల‌ని కోరారు. గ‌తంలోతాను తీసుకువ‌చ్చిన ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో చ‌దువుకున్న వారిలో చాలా మంది ఇప్పుడు సింగ‌పూర్ స‌హా వివిధ దేశాల్లో ప‌నులు చేసుకుంటూ.. బాగున్నార‌ని తెలిపారు.

రానున్న ఫ్యూచ‌ర్ ఐటీ, నాలెడ్జ్‌ ఎకానమీగా ఉంటుంద‌న్నారు. నాలెడ్జ్‌ ఎకానమీలో తెలగుజాతి అగ్రగామిగా ఉండాలంటే ఐటీని ప్రమోట్‌ చేయాలని ఆలోచించి.. ఆదిశ‌గా ఇప్ప‌టికే అడుగులు వేశామ‌న్నారు. ఎన్నార్టీ ఫౌండేషన్‌ ద్వారా తెలుగు వారంతా ఏక‌తాటిపైకి రావ‌డం.. గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని తెలిపారు. సింగపూర్‌లో 40వేల మంది తెలుగు ప్రజలు ఉన్నారంటే గర్వంగా ఉందన్నారు. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను సింగపూర్‌ ప్రభుత్వం ఉచితంగా తయారు చేసి ఇచ్చిందని చెప్పారు. ఏపీలో ఇప్పుడు సుప‌రిపాల‌న సాగుతోంద‌ని.. తెలుగు వారు వ‌చ్చి ఏపీలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని కోరారు. పీ4లో పేద‌ల‌ను ద‌త్త‌త తీసుకుని తెలుగు నేలరుణం తీర్చుకోవాల‌ని కోరారు.