ఉపరాష్ట్రపతి రేసులో కేసీఆర్..? నిజమెంత?

ఔను.. మీరు చదివింది నిజమే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. బీజేపీ తెరవెనుక పెద్ద వ్యూహం పన్నిందని, దీనికి కేసీఆర్ కూడా ఓకే చెప్పారని ప్రచారంలో కీలక భాగంగా చర్చ జరుగుతోంది. దీనిపై తెలంగాణలోని పత్రికలు కూడా ఇప్పుడిప్పుడే కథనాలు రాయడం మొదలుపెట్టాయి.

దీనితో ఏం జరుగుతుందో? అసలు ఈ ప్రచారంలో ఎంత నిజం ఉంది? అనే అంశాలు రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.

ఎప్పటి నుంచో బీజేపీ–బీఆర్‌ఎస్ మధ్య తెరచాటు బంధం కొనసాగుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల కవిత అరెస్టు, తర్వాత ఆమె బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ–బీఆర్‌ఎస్ మధ్య ఏదో మౌన ఒప్పందం జరిగిందన్న చర్చ మొదలైంది.

కవిత కూడా గతంలో చెప్పినట్లు, తాను జైలులో ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేయాలన్న విషయం చర్చకు వచ్చిందని, కానీ తాను ఒప్పుకోలేదని బాంబు పేల్చారు.

ఇక, పార్టీ ప్లీనరీలో కేసీఆర్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించినా బీజేపీపై మాత్రం నొప్పి తగలకుండా వ్యవహరించారు. ఈ విషయాన్ని కవిత తన తండ్రికి రాసిన “Dear Daddy” లేఖలో కూడా ప్రస్తావించారు.

ఇవన్నీ కలిపి చూస్తే, బీఆర్‌ఎస్–బీజేపీ మధ్య తెరవెనుక పాలు పంచుకుంటున్నాయా? అన్న కోణంలో రాజకీయ చర్చలు వేగంగా సాగుతున్నాయి.

వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ బలపడాలని కేంద్ర వ్యూహకర్తల లక్ష్యం. కానీ ఒంటరిగా సాధ్యం కాదని అర్థమైన తర్వాత బలమైన బీఆర్‌ఎస్‌తో కలిసి ముందుకు సాగాలనే ఆలోచన తెరపైకి వచ్చిందని వార్తలు వస్తున్నాయి.

విలీన ప్రతిపాదనలో భాగంగా వచ్చే ఎన్నికల్లో గెలిస్తే సీఎం పోస్టు బీజేపీకి, డిప్యూటీ సీఎం బీఆర్‌ఎస్‌కి ఇవ్వడం, అంతకంటే ముందే కేసీఆర్‌కు ఉపరాష్ట్రపతి పదవిని ఇచ్చి ఆయనను సంతృప్తి పరచడం ద్వారా వ్యూహాన్ని వేగవంతం చేయాలనే భావన బీజేపీ శిబిరంలో నడుస్తోందన్న చర్చ బలంగా వినిపిస్తోంది.

ఇక వీటిలో నిజమెంత? అనేది వేచి చూడాల్సిన విషయమే.