జ‌గ‌న్‌తో క‌లిసి కేసీఆర్ ఆ త‌ప్పులు చేయ‌క‌పోతే.. : రేవంత్

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య‌లు చేశారు. నీటి వినియోగానికి సంబంధించి కేసీఆర్ హ‌యాంలో అనేక త‌ప్పులు జ‌రిగాయ‌ని చెప్పారు. ఆ త‌ప్పులు జ‌రిగి ఉండ‌క‌పోతే.. ఇప్పుడు తెలంగాణ స‌స్య‌శ్యామ‌లం అయ్యేద‌ని తెలిపారు. జ‌గ‌న్‌తో క‌లిసి మిలాఖ‌త్ అయిన కేసీఆర్‌.. తెలంగాణ నీటి ప్ర‌యోజ‌నాల‌ను ఏపీకి తాక‌ట్టు పెట్టార‌ని చెప్పారు. ఒక‌ర‌కంగా తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌ను ధారాద‌త్తం చేశారని తెలిపారు. దీనివ‌ల్ల ఇరు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదాలు మ‌రింత‌గా ముదిరాయ‌ని, వీటిని ప‌రిష్క‌రించేందుకు తాము అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని రేవంత్ రెడ్డి వివ‌రించారు..

తాజాగా కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రులు, ఇత‌ర మంత్రులు భేటీ అయ్యారు. ఈ స‌మావేశంపై మీడియాతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి బ‌న‌క‌చ‌ర్ల వ్య‌వ‌హారం అస‌లు చ‌ర్చ‌కు రాలేద‌న్నారు. తాము అజెండాలో పేర్కొన్న అంశాల‌నే ప్ర‌స్తావించార‌ని.. ఏపీ చెప్పిన బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు విష‌యం అస‌లు అజెండాలో లేన‌ప్పుడు.. దానిపై చ‌ర్చ ఊసుఎక్క‌డ ఉంటుంద‌ని..ప్ర‌శ్నించారు. దీనిపై ఏపీ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు చేసిన ప్ర‌క‌ట‌న విష‌యాన్ని ప్ర‌స్తావించ‌గా..(బ‌న‌క‌చ‌ర్ల‌పై క‌మిటీ ఏర్పాటు) అది ఆయ‌న‌నే అడ‌గాల‌ని.. ఆ విష‌యం త‌మ‌కు తెలియ‌ద‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

తాము గోదావ‌రి జలాల వినియోగం.. నీటి ల‌భ్య‌త‌, త‌మ రాష్ట్రానికి చెందిన వాటాల‌ను మాత్ర‌మే ప్ర‌స్తావించిన‌ట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. దీనిపైనే స‌మావేశం జ‌రిగింద‌న్నారు. ఇదేమీ అపెక్స్‌(వివాదాల ప‌రిష్కారం) క‌మిటీ భేటీ కాద‌న్నారు. దీంతో బ‌న‌క‌చ‌ర్ల ఊసు ఎక్క‌డా రాలేద‌ని చెప్పారు.కేవ‌లం పెండింగు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోస‌మే ఈ స‌మావేశం జ‌రిగింద‌ని వివ‌రించారు. తాము కేసీఆర్ మాదిరిగా ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయం చేయాల‌ని భావించ‌డం లేద‌ని చెప్పారు. అందుకే స‌ర్దుబాటు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌న్నారు.

త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం.. ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్న రేవంత్ రెడ్డి.. వీటిని స‌రిదిద్దేందుకు కేంద్రం కూడా అంగీక‌రించింద న్నారు. ఈ విష‌యంలో తాము విజ‌యం సాధించామ‌న్నారు. కేంద్రం పెద్ద‌న్న పాత్ర మాత్ర‌మే పోషిస్తోంద‌ని.. ఎవ‌రి వైపు మొగ్గు చూప‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. కానీ.. కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా కేంద్రం మొగ్గు చూపిన‌ట్టు ప్ర‌చారం చేసుకుంటున్నా ర‌ని.. దీనిని వారి అభిప్రాయానికే వ‌దిలివేస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.