“మేం అధికారంలోకి వస్తే.. ఏకే 47లే!”

వైసీపీ నాయ‌కుల తీరు మార‌డం లేదు. రోజు రోజుకు నోరు పారేసుకుంటున్నారు. అడ్డు-అదుపు లేకుండా వాగేస్తున్నారు. దీంతో కొత్త వివాదాలు కొని తెచ్చుకుంటున్నామ‌న్న స్పృహ కూడా వారిలో క‌నిపించ‌డం లేదో .. లేక‌, ఇదే ట్రెండ్ అని అనుకుంటున్నారో తెలియ‌దు కానీ.. నాయ‌కులు.. అందునా సీనియ‌ర్ నాయ‌కులు ఒక‌రిని మించి మ‌రొక‌రు అన్న‌ట్టుగా నోటి దురుసు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల‌రెడ్డి నోరు చేసుకున్నారు.

వాస్త‌వానికి మోదుగుల పెద్ద వివాదాస్ప‌ద నాయ‌కుడు అయితే కాదు. కానీ, గూడు మార్చాక‌.. ఏ గూటి చిల‌క ఆ గూటి ప‌లుకే ప‌ల‌కాల‌ని అనుకున్నారో ఏమో.. ఆయ‌న కూడా.. నోటికి ప‌ని చెప్పారు. తాము అధికారంలో కి వ‌స్తే.. తుపాకీలు, ఏకే-47లు బ‌లంగా ప‌నిచేస్తాయ‌ని హెచ్చ‌రించారు. అంతేకాదు.. లాఠీలు కూడా బ‌లంగానే ప‌నిచేస్తాయ‌న్నారు. రెవెన్యూ… హోం శాఖ‌లు కూడా అలానే ప‌నిచేస్తాయ‌ని హెచ్చ‌రించారు. ఇప్పుడు టీడీపీ వారు చేస్తున్న ప‌నులే త‌మ‌కు పాఠాలు నేర్పుతున్నాయ‌ని వ్యాఖ్యానించారు.

వైసీపీ నేత‌లు ఇచ్చిన ఫిర్యాదుల‌ను పోలీసులు స్వీక‌రించ‌క‌పోవ‌డాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. ఈ క్ర‌మం లో పోలీసు స్టేష‌న్ ఎదుట‌.. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో ధ‌ర్నాకు దిగారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నోరు పారేసుకున్నారు. వైసీపీ నాయ‌కులు చూస్తూ ఊరుకున్నార‌ని.. టీడీపీ నేత‌లు రెచ్చిపోతున్నార‌ని అన్నారు. “రెచ్చిపోండి. మీరు ఎంత రెచ్చిపోవాల‌ని అనుకుంటే అంతా రెచ్చిపోండి. ఎందుకంటే.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే.. ఏకే – 47లు, తుపాకులు, లాఠీలు బ‌లంగా ప‌నిచేస్తాయి. మీరు చేసే ప్ర‌తిచ‌ర్య‌కూ.. ప్ర‌తిచ‌ర్య ఉంటుంది. త‌ప్పించుకోలేరు” అని హెచ్చ‌రించారు.

ఇక‌, సోష‌ల్ మీడియాలో వైసీపీ నాయ‌కుల‌పై తీవ్ర అభ్యంత‌రక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నార‌న్న మోదుగుల‌.. వారిపై కేసులు పెడితే.. పోలీసులే తీసుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో పోలీసు పరిపాలన సాగుతోంద‌ని.. వైసీపీ నాయ‌కులు రాష్ట్రంలో ఉండాలా? వ‌ద్దా? అని ప్ర‌శ్నించారు. “రాబోయేది జ‌గ‌న్ ప్రభుత్వమే. మాకు అన్నీ గుర్తే ఉంటాయి. మేం కూడా రాసుకుంటున్నాం. ఆరెంజ్, గ్రీన్‌ డైరీలు స్టార్ట్ చేశాం.” అని వేణుగోపాల్‌రెడ్డి హెచ్చ‌రించారు.