రప్పా రప్పా..వైసీపీ ఎమ్మెల్సీ పై కేసు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మద్దతు తెలిపిన వ్యవహారం 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ రచ్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఏ ముహూర్తాన తన మిత్రుడికి పుష్ప మద్దతిచ్చాడోగానీ…ఆ తర్వాత అటు వైసీపీకి, ఇటు అల్లు అర్జున్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీ…సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో బన్నీ కుదేలయ్యారు.

అంతటితో ఆగకుండా పుష్ప-2 సినిమాలోని రప్పా రప్పా డైలాగ్ ను వైసీపీ కార్యకర్త ఒకరు ప్లకార్డుగా ప్రదర్శించడం..దానికి వైసీపీ అధినేత జగన్ కూడా మద్దతు తెలపడంతో ఏపీ రాజకీయాల్లో రప్పా రప్పా రచ్చ కొనసాగుతోంది. రప్పా రప్పా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్సీపై తాజాగా కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది.

కంచికచర్లలో వైసీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ అరుణ్ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన మెడకు చుట్టుకున్నాయి. వైసీపీ నేతలను, కార్యకర్తలను కూటమి సర్కార్ లక్ష్యంగా చేసుకుంటోందని, రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తోందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని, ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తామని హెచ్చరించారు. కూటమి నాయకులు, అధికారులను వైసీపీ కార్యకర్తల ఇంటివద్దకే తీసుకెళ్లి రప్పా.. రప్పా చేస్తానని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

రప్పా రప్పా అంటూ వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్లు కార్యకర్తలను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించేలా ఉన్నాయని కూటమి నేతలు అంటున్నారు. ఈ క్రమంలోనే అరుణ్ కుమార్ కామెంట్లపై కంచికచర్ల పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ప్రకారం అరుణ్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.