బాబు 4.0.. మామూలుగా లేదుగా!

రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రారంభించిన 4.0 ప్రభుత్వం ఊహకు అందని నిర్ణయాలు, ఆశ్చర్య‌గొలిపే నిర్ణయాలు తీసుకుంటోంది. వాస్తవానికి సాధారణంగా చంద్రబాబు పరిపాలన అంటే హైటెక్ సిటీ లాగా ఐటి పరిపాలనకు ఆయన ప్రాధాన్య ఇస్తారు. అదేవిధంగా పెట్టుబడులకు పరిశ్రమలకు ఎక్కువ అవకాశాలు ఉండేలా చూస్తారు. ఇది అందరికీ తెలిసిందే. గత ఏడాది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో ఇదే తరహాలో పెట్టుబడులు కల్పనకు అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం పెద్దపీట వేసింది.

ఆ తర్వాత కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా, జపాన్, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే క్వాంటం కంప్యూ టింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాయి. దీనిని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కూడా అందిపుచ్చుకున్నప్పటికీ దాదాపు 20 సంవత్సరాల లక్ష్యంతో క్వాంటం మిషన్ను ప్రారంభించింది. వచ్చే 20 సంవత్సరాల్లో దీనిని అభివృద్ధి చేయాలన్నది కేంద్రంలోని మోడీ సర్కార్ పెట్టుకున్న లక్ష్యం. అయితే దీనిని మించి కేవలం ఏడాది కాలం లోనే ఆంధ్రప్రదేశ్లో క్వాంటం వ్యాలీని ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించుకోవడం పట్ల అంతర్జాతీయ నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇది సాధ్యమేనా అని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన నిపుణులు ఏపీ రాజధానికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆహ్వానం పలికింది. క్వాంటం కంప్యూటింగ్‌లో నిష్ణాతులైన అమెరికా శాస్త్రవేత్తలు.. ఏపీలో ఏ విధంగా జరుగుతోంది.. ఏపీలో ఏ విధంగా దీనిని ముందుకు తీసుకు వెళుతున్నారు.. అనే అంశాలపై అధ్యయనం చేయడంతో పాటు వారికి తెలిసిన అనుభవాన్ని పంచుకునేందుకు కూడా సిద్ధమైనట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

అదేవిధంగా ప్రపంచాన్ని శాసించేదిగా భావిస్తున్న కృత్రిమ మేధ అంటే ఏఐ రంగంలోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా దూసుకుపోయేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కూడా భారతదేశంలోనే మొట్టమొదటి ప్రయత్నం అని చెప్పాలి. ఇప్పటివరకు ఐటీ విష‌యంలో బెంగళూరు, చెన్నై తర్వాత హైదరాబాద్ ఉండగా తొలిసారిగా ఏపీలో అటు క్వాంటం వ్యాలీ ఇటు ఏఐ యూనివర్సిటీని నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం ముఖ్యంగా చంద్రబాబు దూర దృష్టితో తన ఆలోచనను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయడం వంటివి ఊహకు అందని నిర్ణయాలుగా గతంలో ఆయన ప్రభుత్వంలో పనిచేసిన ఒకరిద్దరూ ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానించటం విశేషం.

అయితే ఇప్పటికిప్పుడు వీటివల్ల రాష్ట్రంలో ప్రయోజనం ఎంత అనేది పక్కన పెడితే భవిష్యత్తు తరాలకు, భవిష్యత్తులో దేశానికి కూడా ఏపీ ఒక గమ్యస్థానంగా ఒక మార్గదర్శిగా మారుతుందని వారు చెబుతుండడం గ‌మనార్హం. కాబట్టి చంద్రబాబు చేపట్టిన 4.0 ప్రభుత్వం నిజంగా అద్భుతాలనే ఆవిష్కరించే అవకాశం ఉందని ఐటీని మించి దూసుకుపోయే ఛాన్స్ కనిపిస్తోందని చెబుతున్నారు.