‘సుప‌రిపాల‌న‌’పై.. జ‌నం ఏం చెబుతున్నారంటే..!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి, పెట్టుబడులు తీసుకురావడం వంటి వాటిపై ఆనందం వ్యక్తం చేస్తున్నారా? అనేది ప్రస్తుతం టిడిపి నాయకులు నిర్వహిస్తున్న ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం తెలుసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికి సుమారు 60 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని తొలి విడత పూర్తి చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు కూడా అందాయి.

జిల్లా కలెక్టర్లు సుపరిపాలనలో తొలి అడుగు కార్య‌క్ర‌మానికి సంబంధించి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేశారు. అయితే, ఈ నివేదికల ద్వారా ప్రభుత్వానికి కీలకమైన సమాచారం చేరినట్లు తెలిసింది. సుపరిపాలంలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రులు ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రజల నుంచి అనేక సమస్యలు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా కొత్తగా పింఛన్లు కోరుకుంటున్న వారు, గతంలో కొన్ని రాజకీయ కారణాల రీత్యా పింఛన్లు కోల్పోయిన వారు.. తమకు పింఛన్లు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించడం కనిపించింది. నిజానిగే వైసిపి హయాంలో కొంతమంది పింఛన్లు తొలగించిన మాట వాస్తవం.

అయితే కారణాలు ఏవైనా రాజకీయ కారణాలతోనే వారు పింఛన్లు తొలగించారన్న వాదన తెర మీదకు వచ్చింది. దీంతో ఇలాంటివారు సుమారు రాష్ట్రవ్యాప్తంగా 20 నుంచి 30 వేల మంది ఉన్నట్టు ప్రభుత్వానికి సమాచారం ఉంది. వీరందరికీ కొత్తగా పింఛన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీరికి తోడు 60 ఏళ్ళు దాటిన వారు మరి కొందరు కొత్తగా పింఛన్లు కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరంతా ప్రభుత్వంపై చాలా ఆశలే పెట్టుకున్నారు. ఇప్పుడు వీరి విషయం కూడా ప్రభుత్వానికి సమస్యగా మారింది. మరోవైపు ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి రెండో విడత సుమారు రెండు లక్షల మందికి పైగా సొమ్ములు పడలేదని ప్ర‌జ‌లు చెబుతున్నారు.

సుపరిపాలనలో తొలి అడుగులు కార్యక్రమంలో మంత్రులకు అనేక విష‌యాలు నివేదిస్తున్నారు. తాము గ్యాస్ బండ తీసుకొని నెలలు గడిచిపోయినా ఇప్పటివరకు తమకు ప్రభుత్వం నుంచి రాయితీ డబ్బులు పడలేదని చాలామంది ఫిర్యాదు చేశారు. అదేవిధంగా రేషన్ కార్డు కోసం లక్షల మంది మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించారు. అంటే ఒక రకంగా చూసుకుంటే క్షేత్రస్థాయిలో ప్రజలు ఆశిస్తున్న దానికి ప్రభుత్వం పనితీరుకు మధ్య కొంత తేడా అయితే కనిపిస్తోంది అన్నది స్పష్టమైనది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం దానికి తగ్గట్టుగా నిర్ణయాలు ఉంటాయా ఉండవా అనేది చూడాలి.

ప్రజలు కోరుకుంటున్న విధంగా పరిపాలన ముందుకు సాగితే బాగానే ఉంటుంది. లేకపోతే మాత్రం ఇబ్బందికర పరిస్తితి తప్పదు. ఎందుకంటే గతంలో కూడా ఇంటింటికి కార్యక్రమాన్ని వైసీపీ నిర్వహించింది. కానీ, ప్రజలు ఇచ్చిన వినతులు, సమస్యలపై మాత్రం పార్టీ ఎక్కడ పట్టించుకోలేదు. నాయకులు అసలే పట్టించుకోలేదు. దీంతో గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీని దూరం పెట్టారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తొలి ఏడాదిలో జరిగిన పొరపాట్లు.. ప్రజల నుంచి వస్తున్న విన‌తులు, సమస్యలు వంటి వాటిని ప్రత్యేకంగా గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉంది. తద్వారా ప్రభుత్వంపై మరింత విశ్వాసాన్ని పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.