వైసీపీ వ‌చ్చినా.. వ‌లంటీర్లు రారు.. అదంతే.. !

Volunteers

ఈసారి కాలం క‌లిసి వ‌చ్చి.. వైసీపీ అధికారంలోకి వస్తే తిరిగి వాలంటీర్లను తీసుకుంటారా? వైసిపి నియమించిన వాలంటీర్లను టిడిపి కూటమి తొలగించిన నేపథ్యంలో వారికి తిరిగి ఉపశమనం కలిగిస్తారా? అంటే కాదనే సమాధానమే వినిపిస్తోంది. వాలంటీర్ల వ‌ల్లె తాము ఓడిపోయామని, వాలంటీర్ల కారణంగానే ప్రజలకు నాయకులకు మధ్య సంబంధాలు తెగిపోయాయ‌ని వైసిపి నాయకులు పదేపదే చెబుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేయటం గమనార్హం.

ఇక మిగతా నాయకుల విషయానికి వస్తే వారు కూడా వాలంటీర్ల విషయంలో సానుభూతి ఏమాత్రం చూపించడం లేదు. పైగా వాలంటీర్లకు తగిన శాస్తి జరిగిందని సంతోషం కూడా అంతర్గత సమావేశాల్లో వ్యక్తం చేస్తున్నారు. ఇక వైసిపి అధినేత జగన్ కూడా వాలంటీర్లను పక్కన పెట్టేశారు. పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తానని పదేపదే ఆయన కూడా చెబుతున్నారు. అంటే దీనిని బట్టి వాలంటీర్ల వ్యవహారంపై వైసిపి ఇక దాదాపు తప్పుకొంద‌ని తెలుస్తోంది. కానీ, రాష్ట్రస్థాయిలో అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో వాలంటీర్లు ఇప్పటికీ ఉద్యమాలు చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్నారు.

తమను తిరిగి విధుల‌లోకి తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ న్యాయం చేయడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇలాంటి వారిని కలిసి వైసిపి నాయకులు మద్దతిస్తారని, వారి తరఫున పోరాటం చేస్తారని అనుకున్నా.. ఎన్నికల సమయంలో వారు వ్యవహరించిన తీరు, వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారన్న ఉద్దేశం.. ఉండటంతో వైసిపి నాయకులు ఎవరూ కూడా వారి జోలికి వెళ్లడం లేదు. వారిని పట్టించుకోవడం లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకున్నా(అవ‌కాశం ఉంటే) కూడా వైసిపి ఎట్టి పరిస్థితుల్లోనూ వాలంటీర్లను దరి చేర్చుకోనివ్వదనే చర్చ కూడా తాజాగా వెలుగు చూసింది.

ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని పేర్ని నాని, కొడాలి నాని అలాగే ఇతర నాయకులు కూడా పార్టీ అధినేత ముందు చెబుతున్నారు. జ‌గ‌న్ కూడా అలానే ఆలోచ‌న చేస్తున్నారు. సో ఎలా చూసుకున్న వాలంటీర్ల వ్యవహారం వైసిపీ విడిచిపెట్టింద‌న్న జోరుగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక వచ్చే ప్రభుత్వం వైసిపిదే అయినా కూడా.. అప్పుడు కూడా వలంటీర్లకు ప్రాధాన్యం ఉండదని తెలుస్తోంది. కేవలం కార్యకర్తలకు మాత్రమే అవకాశం ఉంటుందని సీనియర్ నాయకులు త‌ర‌చుగా చెబుతున్నారు. బలంగా కూడా వినిపిస్తున్నారు. ఏదేమైనా రాష్ట్రంలో వ‌లంటీర్ల శకం ఇక ముగిసినట్టే అని తెలుస్తోంది.