గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌పై చంద్ర‌బాబు వ్యూహం.. ఎవ‌రికి న‌ష్టం!!

మ‌రో రెండు నెల‌ల్లో జ‌ర‌గ‌నున్న గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోనే ఉన్న చంద్ర‌బాబు .. ఈ ఎన్నిక‌ల‌పై రాష్ట్ర పార్టీ నేత‌ల‌తో ఆయ‌న స‌మాలోచ‌న‌లు జ‌రుపుతున్నారు. ప్ర‌స్తుతం గ్రేట‌ర్‌లో ప్రభుత్వ వ్య‌తిరేక గాలులు ఎక్కువ‌గా వీస్తున్నాయి. కొన్నిరోజుల కింద‌ట వ‌చ్చిన తుఫాను కార‌ణంగా భారీగా కురిసిన వ‌ర్షాల‌తో హైద‌రాబాద్ పూర్తిగా మునిగిపోయింది. మ‌నుషులుసైతం కొట్టుకుపోయి.. మృతి చెందారు. మ‌నిషిలోతు నీళ్ల‌లో ప్ర‌జ‌లు నిలువునా ఒణికి పోయారు.

అయితే, ఆయా ప‌రిస్థితుల‌ను దీటుగా ఎదుర్కొన‌లేక ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని గ్రేట‌ర్ వాసుల్లో ఇప్ప‌టికీ ఆగ్ర‌హం పెల్లుబుకుతూనే ఉంది. ఇది గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపిస్తుంద‌ని.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు కూడా ప‌నికి వ‌స్తుంద‌ని టీడీపీ భావిస్తోంది. గ్రేట‌ర్‌లో కూక‌ట్ పల్లి, ఎల్‌బీన‌గ‌ర్‌, ఖైర‌తాబాద్ వంటి కీల‌క ప్రాంతాల్లో ఏపీ నుంచి వ‌చ్చిన సెటిల‌ర్లు ఎక్కువ‌గా ఉన్నారు. వీరిపై గ‌తంలోనూ చంద్ర‌బాబు ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. అప్ప‌ట్లో కేసీఆర్ దూకుడు ఎక్కువ‌గా ఉండ‌డంతో బాబు స్వ‌యంగా ప్ర‌చారం చేసినా.. ఫ‌లితం రాబ‌ట్టుకోలేక పోయారు.

అయితే.. ఎదురైన స‌మ‌స్య‌ల‌ను త‌మ‌ను అనుకూలంగా మార్చుకుని గ్రేట‌ర్‌లో మెజారిటీ స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కాల‌ని భావిస్తున్నారు చంద్ర‌బాబు. ఆది నుంచి ఆయ‌న చెప్పే.. హైద‌రాబాద్‌ను డెవ‌ల‌ప్ చేశాన‌ని. సైబ‌రాబాద్ త‌న వ‌ల్లే సాధ్య‌మైంద‌ని ఆయ‌న మ‌రోసారి చెప్ప‌నున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో మెజారిటీ సెటిల‌ర్లు.. టీడీపీవైపు మొగ్గు చూపితే.. ఎవ‌రికి న‌ష్టం? అనేదే ఇప్పుడు కీల‌క ప్ర‌శ్న‌. అధికార ప‌క్షంక‌న్నా.. కాంగ్రెస్‌కు ఇది తీవ్ర దెబ్బ‌గా మారుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఏపీ సెటిల‌ర్ల‌లో ఎక్కువ మంది కాంగ్రెస్ సానుభూతిప‌రులు ఉన్నారు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ నేత‌లు ఇప్ప‌టికీ వీరి ఓటు బ్యాంకు కోసం.. చ‌క్రం తిప్పుతుంటారు. ఇప్పుడు ఏర్ప‌డిన‌.. స‌ర్కారు వ్య‌తిరేక‌త‌ను కాంగ్రెస్ త‌న‌కు అనుకూలంగా మార్చుకుని గ్రేట‌ర్‌ప‌గ్గాల‌ను అందిపుచ్చుకోవాల‌ని భావిస్తోంది.

కానీ, చంద్ర‌బాబు క‌నుక రంగంలోకి దిగితే.. సెటిల‌ర్లు.. టీడీపీ వైపు మొగ్గు చూపే అవ‌కాశం ఉంద‌ని.. ఇది అంతిమంగా.. కాంగ్రెస్‌కు ఇబ్బందేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఇటీవ‌ల వ‌ర‌ద‌లు.. వ‌ర్షాలు వ‌చ్చిన‌ప్పుడు అధికార పార్టీ ఎలా వ్య‌వ‌హ‌రించిందో.. ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ అంత‌క‌న్నాదారుణంగా వ్య‌వ‌హ‌రించింది. క‌నీసం త‌మ‌ను ప‌ల‌క‌రించ‌లేద‌ని.. ఇక్క‌డివారు ఇటీవ‌ల విమ‌ర్శ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్‌కు ప‌డుతుంద‌ని భావించిన ప్ర‌తి ఓటూ.. టీడీపీకి ప‌డే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.