వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. చేపట్టిన చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం పర్యటన ద్వారా ఆయన ఏం సాధించినట్టు? రైతు లకు ఏమేరకు మేలు చేసినట్టు? ఇదీ.. ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్నలు. నిజానికి మామిడి కొనుగోలు సమస్య.. గత రెండు నెలలుగా ఉంది. రైతులు ఇబ్బందులు పడుతున్న మాటా వాస్తవమే. నెల రోజుల కిందటే.. టీడీపీ అనుకూల మీడియా లోనే మామిడి రైతుల కష్టాలపై కథనాలు వచ్చాయి. వారికి ధరలు రావడం లేదని.. కిలో రూ.2, రూ.1కే దళారులు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
అప్పట్లోనే ప్రభుత్వం స్పందించింది.. రాష్ట్ర సర్కారు తరఫున రూ.4 మద్దతు ధరలను ప్రకటించింది. కనీసంలో కనీసం రూ.8కి తగ్గకుండా(కిలో చొప్పున) కొనుగోలు చేయాలని కూడా ఆదేశించింది. దీనికితోడు కేంద్రంతోనూ చర్చలు జరిపారు. కేంద్రాన్ని కూడా ఆదుకోవాలని సీఎం చంద్రబాబు గత నెల 21నే లేఖ రాశారు. ఈ నిర్ణయం రావడం లేటైంది. అది వచ్చాక.. అప్పటికే అమ్మిన రైతులకు కూడా న్యాయం చేస్తామని(అన్నీ ఆన్లైన్ కావడంతో) చంద్రబాబు కూడా గత నెలలోనే ప్రకటన జారీ చేశారు. దీంతో రైతులు తమ దిగుబడులను 90 శాతం మేరకు అమ్మేసుకున్నారు.
దీనిపై కేంద్రంతో మాట్లాడిన మంత్రిఅచ్చెన్నాయుడు.. మిగిలిన సొమ్మును రైతులకు త్వరలోనే డీబీటీ రూపంలో వేస్తామని చెప్పారు. ఇక, మిగిలింది.. 10 శాతం దిగుబడి మాత్రమే. దీనిపైనే రైతులు పట్టుబడుతున్నారు. దీనిని ఆసరా చేసుకున్న జగన్.. బంగారు పాళ్యం పర్యటన పెట్టుకున్నారు. కానీ, జగన్ వస్తున్నారని తెలిసి.. బల ప్రదర్శనకు సిద్ధమైన వైసీపీ నాయకులు ఎక్కడెక్కడి నుంచో(రైతులు కాకుండా) కార్యకర్తలను తరలించారు. దీంతో చిత్తూరులోని బంగారుపాళ్యం సహా చుట్టుపక్కల ప్రాంతాలుకిక్కిరిసిపోయిన మాట వాస్తవం.
కానీ.. అసలు జగన్పర్యటన లక్ష్యం ఏంటి? రైతులను పరామర్శించి.. వారికి న్యాయం చేయాలన్న ఒత్తిడి చేయాలన్నదే. కానీ.. ఇది పక్కదారి పట్టింది. కార్యకర్తల దూకుడు.. పోలీసుల లాఠీ చార్జీలతో బంగారు పాళ్యం రణరంగాన్ని సృష్టించిందనే చెప్పాలి. అంతేకాదు.. తరలించిన నాయకులపై కేసులు పెట్టారు. పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించిన కార్యకర్తలపై రౌడీ షీట్లు తెరుస్తామని తాజాగా ఎస్పీ మణికంఠ ప్రకటన చేశారు. మొత్తంగా జగన్ సాధించింది ఏంటి? అంటే.. అభిమానం చాటుకున్న కార్యకర్తలను రెచ్చగొట్టి..కేసుల్లో ఇరుక్కునేలా చేయడం తప్ప.. మరేమీ చేయలేకపోయారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates