గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ వ్యూహం ఇదేనా ?

దుబ్బాక ఉపఎన్నికలో అనూహ్యంగా గెలిచిన బీజేపీ తన తర్వాత టార్టెట్ గా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఎన్నికల పరిశీలకులుగా ఐదుగురు ఇన్చార్జీలను నియమించింది. వీరిలో నలుగురు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. మరొకరు కర్నాటక రాష్ట్రానికి చెందిన నేత కావటం గమనార్హం. నిజానికి జీహెచ్ఎంసి ఎన్నికల్లో గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు చెందిన పరిశీలకులు చేయగలిగేదేమీ ఉండదు. కానీ ఇక్కడే బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

జీహెచ్ఎంసి పరిధిలో సుమారు 70 లక్షల ఓట్లుంటాయి. 150 డివిజన్లలోను సగటున ఒక్కో డివిజన్లో 60-70 వేల ఓట్లుంటాయని అంచనా. జీహెచ్ఎంసి పరిధిలోని జనాభాలో వివిధ రాష్ట్రాలకు చెందిన జనాలున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఓల్డుసిటీలో ముస్లిం జనాలతో పాటు ఉత్తరాధికి చెందిన ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. వీరిలో గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, రాజస్ధాన్ వ్యాపార కుటుంబాలే చాలా ఎక్కువగా ఉన్నాయట.

అలాగే ఇక హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాలతో పాటు సికింద్రాబాద్ ప్రాంతంలో కూడా ఉత్తరాధివారి ప్రభావం ఎక్కువగానే ఉంది. వీరిలో పశ్చిమబెంగాల్, మార్వాడీ, ఢిల్లీ, గుజరాత్, ముంబై మూలాలున్న వారే చాలా ఎక్కువని బీజేపీ అంచనా లెక్కలేసింది. అంటే హైదారబాద్+సికింద్రాబాద్ లో సుమారు 20 లక్షల మంది ఉత్తరాధి రాష్ట్రాల వారి జనాభానే ఉందట. దాంతో వాళ్ళ ఓట్లపై బీజేపీ నేతలు దృష్టి పెట్టారు. ఏ ఏ డివిజన్లలో ఏ రాష్ట్రానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారనే విషయమై వివరాలు సేకరిస్తోంది.

దాని ప్రకారం అవసరమైతే ఆ రాష్ట్రాలకు చెందిన వారిలో రాజకీయంగా బాగా చురుకుగా ఉన్నవారినే తమ తరపున అభ్యర్ధులుగా రంగంలోకి దింపాలనే ప్లాన్ కూడా చేస్తున్నారు. పార్టీ తరపున అవసరమైన మద్దతిస్తే సామాజికవర్గాల పరంగా ఆ అభ్యర్ధులే తమ రాష్ట్రాల వారి మద్దతును కూడగట్టుకుంటారనే ఆలోచనలో బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక రాష్ట్రాలకు చెందిన నేతలనే పరిశీలకులుగా నియమించింది. అంటే వీరితో ఆయా రాష్ట్రాలకు చెందిన గ్రేటర్లో సెటిలైన ప్రముఖులతో సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు.

ఈ విషయం ఇలాగుంటే మొత్తం 150 డివిజన్లలోను పోటీ చేయాలా లేకపోతే తాము కచ్చితంగా గెలుస్తామనే అంచనాలుండే డివిజన్లలో మాత్రమే పోటీ చేయాలా అనే ఆలోచన కూడా జరుగుతోంది. ఓల్డు సిటిలోని కొన్ని డివిజన్లలో ముస్లింల ప్రాబల్యం చాలా ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే. అక్కడ ఇతరులు పోటీ చేసినా గెలిచే అవకాశాలు తక్కువే. ఇటువంటి డివిజన్లలో పోటీ చేసి ఓడిపోయేకన్నా గెలిచే అవకాశాలున్న డివిజన్లపైనే దృష్టి పెడితే బాగుంటుందని కూడా కొందరు సీనియర్ నేతలు చెబుతున్నారట. పనిలో పనిగా టీఆర్ఎస్ అసంతృప్తులు, కాంగ్రెస్ అసంతృప్తులను గుర్తించి పార్టీలోకి లాక్కుని టికెట్లిచ్చి ప్రోత్సహించాలని కూడా ఆలోచిస్తున్నారు కమలనాదులు. మొత్తానికి జీహెచ్ఎంసి ఎన్నికల నుబీజేపీ బాగా సీరియస్ గానే తీసుకున్నట్లు కనబడుతోంది.