ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే. యువ నాయకుడు. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన నేత. అనేక కష్టాలు ఎదుర్కొన్నారు . అనేక కేసులు కూడా ఎదుర్కొన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో విజయం సాధించారు. ఆయనే గాలి భాను ప్రకాష్. గాలి ముద్దుకృష్ణమనాయుడు వారసుడుగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన భాను.. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న తర్వాత మౌనంగా ఎదగడమే ముఖ్యమని భావిస్తూ అదే పంథాలో ముందుకు సాగుతున్నారు. సాధారణంగా నగరి నియోజకవర్గ అంటే ఫైర్ బ్రాండ్ రాజకీయాలకు నిదర్శనం.
2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ విజయం దక్కించుకున్న వైసిపి నాయకురాలు రోజా ఫైర్ బ్రాండ్ రాజకీయాలకు కేరాఫ్ గా నియోజకవర్గాన్ని నిలబెట్టారు. దీంతో నగరి నియోజకవర్గం అంటే ఫైర్ బ్రాండ్ రాజకీయాలకు కేరాఫ్ అని అందరూ భావిస్తారు. అలాంటి నియోజకవర్గంలో ప్రస్తుతం తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేగా గాలి భాను ప్రకాష్ తనదైన శైలితో పరిస్థితిని మారుస్తున్నారు. విధేయత, వినయంతో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రజలకు చేరువ అవుతున్నారు. ఇది ఒక అసాధారణ ఘట్టమనే చెప్పాలి.
ప్రస్తుతం రాష్ట్రంలోని సగానికి పైగా నియోజకవర్గాల్లో ఫైర్ బ్రాండ్ రాజకీయాలు చేస్తున్న నాయకులే కనిపిస్తున్నారు. ముఖ్యంగా తొలిసారి గెలిచిన వారిలో కూడా దూకుడుగా వ్యవహరిస్తున్న వారు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అలాంటి వాతావరణంలో నగరి నియోజకవర్గంలో భాను ప్రకాష్ చాలా కూల్ గా వ్యవహరిస్తూ.. ప్రజలకు చేరువవుతూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లో పనిచేసే అతి కొద్దిమంది నాయకుల్లో భాను ప్రకాష్ ఒకరు. తండ్రి చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యమని పదేపదే చెబుతున్నారు.
అంతేకాదు.. భాను ప్రకాష్ తనకంటూ కొత్తగా మరికొన్ని అంశాలను జోడించి వాటిని కూడా సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలు అంటే కచ్చితంగా పాటించాలని నియమం పెట్టుకునే ఎమ్మెల్యేలలో ఈయన కూడా ఒకరు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని చేపట్టాలని చంద్రబాబు పిలుపు ఇవ్వగానే.. ఈ కార్యక్రమాన్ని అమలు చేసే నియోజకవర్గాలలో నగరి కూడా చేరిపోయింది. ఉదయం 6 గంటల నుంచి ప్రజల మధ్యకు వెళ్తూ రాత్రి పొద్దుపోయే వరకు కూడా వారి సమస్యలను పరిష్కరించేందుకు, అధికారాలతో చర్చలు జరుపుతూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.
అదే సమయంలో వివాదాలకు దూరంగా విమర్శలకు ఇంకా దూరంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి నగరి నియోజకవర్గంలో రోజాను విమర్శించేందుకు లేదా వైసిపి హయాంలో జరిగిన తప్పులను ఎత్తిచూపేందుకు చాలా స్కోప్ కనిపిస్తుంది. కానీ భాను ప్రకాష్ వాటి జోలికి వెళ్లకుండా వివాదాలు కొనితెచ్చుకోకుండా తాను వివాదం కాకుండా జాగ్రత్తపడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి, తన తండ్రి సాధించిన విజయాలు, తన తండ్రి వారసత్వాన్ని నిలబెట్టే దిశగా ఆయన అడుగులు వేస్తుండడం అందరికీ ఆదర్శంగా కనిపిస్తోంది. దీనిని సీనియర్ నాయకులు కూడా తప్పు పట్టలేకపోతున్నారు.
ఎందుకంటే ప్రజలకు చేరువైతే మళ్లీ మళ్లీ విజయం దక్కించుకునేందుకు అవకాశం ఉంటుందన్న ఏకైక లక్ష్యం భాను ప్రకాష్ లో కనిపిస్తుండడమే. వివాదాలకు దగ్గరగా ఉండి రోజు విమర్శలు చేయడం వల్ల ప్రజల్లో చులకన అవుతామన్న భావనతో ఆయన వివాదాల జోలికి పోకుండా అందరిని కలుపుకొని ముందుకు సాగుతున్నారు. సీనియర్ నాయకుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. పార్టీ లైన్ ప్రకారం ఏం చేయాలో అది చేస్తున్నారు తప్ప ఇంతకుమించి.. జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇది ఆయనకు మంచి పేరును తీసుకురావడంతో పాటు గాలి ముద్దుకృష్ణమ తనయుడుగా మరింతగా ఆయనకు గుర్తింపు లభించేలా చేసింది.
గతంలో ముద్దు కృష్ణమ నాయుడు కూడా జాగ్రత్తగా అడుగులు వేశారు. ఎక్కడా వివాదాలు జోలికి పోకుండా అవసరమైన సందర్భంలో మాత్రమే ప్రత్యర్థులను టార్గెట్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఆయన తనయుడు ముందుకు సాగుతూ తండ్రికి తగ్గ వారసుడిగా పేరు తెచ్చుకుంటున్నారనేది స్థానికంగా వినిపిస్తున్న మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates