15 శాతం స‌రే.. 40 శాతం నిల‌బ‌డేనా ..!

గత ఎన్నికల్లో వైసిపి 40% ఓటు బ్యాంకు ను తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చిన టిడిపి, జనసేన, బిజెపి కూటమికి వైసీపీకి మధ్య కేవలం 10 శాతం మాత్రమే వ్యత్యాసం కనిపిస్తుంది. దీనిని అధిగమించి వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలనేది వైసిపి భావిస్తున్న కీలక అంశం. ఈ క్రమంలో గత ఎన్నికల్లో వచ్చిన 40 శాతం ఓటు బ్యాంకు స్థిరంగా ఉంటుందని లెక్కలు వేసుకుంటోంది. దీనికి అదనంగా మరో 15% ఓటు బ్యాంకును సాధించగలిగితే విజయం తమదేనని జగన్ సహా ఇతర నాయకులు అంచనా వేస్తున్నారు.

దీంతోనే 15% ఓటు బ్యాంకు ను దక్కించుకునేందుకు ప్రయాస పడుతున్నారు. అయితే.. గత ఎన్నికల్లో 40% వచ్చిన ఓటు బ్యాంకు తమకు స్థిరంగా ఉంటుందని అనుకోవడం ఎంతవరకు కరెక్టో ఆ పార్టీ నాయకులు అంచనా వేసుకోవాలి. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల తీరు తెన్నులు, ఆలోచనా విధానాలు కూడా మారిపోతూ ఉంటాయి. గత ఎన్నికల్లో ముందు వైసీపీ ఇచ్చిన పథకాలకు అనుకూలంగా ఆ 40% వోటు బ్యాంకు వచ్చిందని భావించినా.. ఇప్పుడు అంతకుమించి పథకాలను అమలు చేస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారు.

ఉదాహరణకు అమ్మ ఒడి పథకాన్ని తీసుకుంటే వైసీపీ హయంలో ఇంటికి ఒక బిడ్డకు మాత్రమే 13000 చొప్పున అందించారు. కానీ ఇప్పుడు ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి కూడా పథకాలను అందిస్తున్నారు. దీంతో ఆయా కుటుంబాలు వైసీపీకి దూరమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ఒకప్పుడు వైసీపీకి అనుకూలంగా ఉన్న కుటుంబాలు ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం వంటి విషయాల్లో కూటమి వైపు మొగ్గు చూపుతున్నాయి. దీంతో ఆ 40% ఓటు బ్యాంకులో కచ్చితంగా 10 నుంచే 20 శాతం మధ్య తగ్గే అవకాశం ఉందని ఒక అంచనా ఉంది.

దీనిని బట్టి గత ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకు స్థిరంగా ఉంటుంద‌న్న‌ లెక్క సరికాదన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. ప్రయత్నం చేయటం మంచిదే అయితే.. తమకు గత ఎన్నికల్లో వచ్చిన 40 శాతం ఓటు బ్యాంకు స్థిరంగా ఉంటుందని, కేవలం 15% ఓటు బ్యాంకు కోసం పోరాడాల్సి ఉంటుందని నాయకులు అంచనా వేసుకోవడం మాత్రం ఖచ్చితంగా పొరపాటు. పూర్తిస్థాయిలో జీరో నుంచి మొదలు పెడితే తప్ప వైసిపి వచ్చే ఎన్నికల నాటికి పుంజుకునే అవకాశం లేదని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న అంచ‌నాల‌ ప్రకారం వైసీపీ నాయకులు, ఆ పార్టీ అధినేత జగన్ మాత్రం కేవలం 15% పుంజుకుంటే సరిపోతుందని లెక్కలు వేసుకుంటున్నారు.

మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత జరిగిన అభివృద్ధి, అదేవిధంగా అందుతున్న పథకాలు సంక్షేమం వంటివి కచ్చితంగా ప్రజలపై ప్రభావం చూపించక మానవు. దీనిని బట్టి గత ఎన్నికల్లో వచ్చిన 40% స్థిరంగా ఉంటుందని లెక్కలు వేసుకోవడం కచ్చితంగా తప్పు అన్నది పరిశీలకుల మాట. మరి వైసీపీ నాయకులు ఏం చేస్తారో చూడాలి.