వైసీపీలో అంత‌ర్గ‌త క‌ల‌హాల‌కు ఇదే రీజ‌నా?

గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం తాడికొండ‌. రాజ‌ధాని ప్రాంతంలో ఉన్న ఈ నియోజ‌క ‌వ‌ర్గం నుంచి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీ నాయ‌కురాలిగా రంగంలోకి దిగిన డాక్ట‌ర్ ఉండ‌వ‌ల్లి శ్రీదేవి విజ‌యం సాధించారు. విద్యావంతురాలుగా, మంచి వైద్యురాలిగా గుర్తింపు ఉన్న శ్రీదేవి .. రాజ‌కీయంగా మాత్రం విఫ‌ల‌మ‌వుతున్నార‌ని.. వైసీపీలోనే చ‌ర్చ‌కు దారితీస్తోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆమె నిత్యం వివాదాల‌తోనే స‌హ‌వాసం చేస్తుండ‌డం.. కొన్నాళ్ల కింద‌ట సీఐని బెదిరించిన ఫోన్ కాల్ సంచ‌ల‌నం రేపింది. ఇటీవ‌ల రెడ్లు డేంజ‌ర్‌ అంటూ.. మ‌రో ఫోన్ కాల్ వెలుగు చూసింది. దీంతో ఉండ‌వ‌ల్లి శ్రీదేవి వ్య‌వ‌హారం.. రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయింది.

అయితే, ఈ మొత్తం ఎపిసోడ్‌పై వైసీపీలోనే పోస్టు మార్ట‌మ్ జ‌రుగుతోంది. నిత్యం వివాదాలు ఎందుకు వ‌స్తున్నాయి? నిజంగానే ఎమ్మెల్యే వ్య‌వ‌హార శైలి వివాదంగా ఉందా? అనే కోణంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి దృష్టి పెట్టారు. దీంతో ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగు చూసింది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌తంలో విజ‌యం సాధించి, మంత్రిగా కూడా చ‌క్రం తిప్పిన డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్‌పై ఇప్పుడు అంద‌రి వేళ్లూ ఉన్నాయి. ఆయ‌న వ్యూహాత్మ‌కంగా ఇక్క‌డ త‌న అనుచ‌రులను ఎమ్మెల్యేపై ప్ర‌యోగించార‌ని అంటున్నారు. గ‌తంలో టీడీపీలో ఉన్న డొక్కా.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే, చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఈ టికెట్ ఇవ్వ‌లేదు.

ఎక్క‌డో డొక్కాకు సంబంధం లేని ప్ర‌త్తిపాడు ను కేటాయించారు. అక్క‌డ ఆయ‌న ఓడిపోయారు. ఇక‌, ఆ త‌ర్వాత వైసీపీలోకి చేరిపోయారు. ప్ర‌స్తుతం వైసీపీ త‌ర‌ఫున ఎమ్మెల్సీగా ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న త‌న ఆశ‌ల‌ను చంపుకోలేక పోతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కానీ, దీనికి సంబంధించి జ‌గ‌న్ నుంచి ఎలాంటి హామీ ద‌క్క‌లేదు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యేపై వివాదాస్ప‌దురాలు.. అనే ముద్ర వేయించే క్ర‌మంలో కొంద‌రు వైసీపీ నేత‌ల‌తో ఆయ‌న చేతులు క‌లిపిన‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే పాత ఆడియోలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయ‌ని.. అంటున్నారు వైసీపీ నాయ‌కులు. అయితే… దీనికి జ‌గ‌న్ సీరియ‌స్‌గా తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో మాజీ మంత్రి డొక్కా వ్యూహాలు ఏమేర‌కు ఫ‌లిస్తాయో తెలియ‌దు కానీ.. ఉండ‌వ‌ల్లిపై జ‌రుగుతున్న కుట్ర‌లు నిజ‌మ‌ని తేలితే.. ఆయ‌న‌కే ప్ర‌మాద‌మ‌ని మాత్రం వైసీపీ నాయ‌కులు చెవులు కొరుక్కోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు.. అనేదానికి తాడికొండ నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది.