చంద్ర‌బాబు చేస్తోంది క‌రెక్టే..!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తరఫున చేసిన మంచి పనులను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చిన పథకాలు, చేసిన సంక్షేమం, ఇతరత్రా అనేక అంశాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలని భావిస్తారు. ప్రధానంగా పెట్టుబడులు తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగ కల్పనకు తమ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తోందో అన్నది చెప్పే ప్రయత్నం చేస్తుంది.

అదే విధంగా రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, వెనుక బ‌డిన జిల్లాల అభివృద్ధి వంటి వాటిని కూడా ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు తీసుకు వెళ్లాలని నిర్ణయించింది. అయితే, ఈ కార్యక్రమంలో తమను భాగస్వాములు చేయడం లేదని, తమను పిలవడం లేదని, కూట‌మి భాగస్వామి పక్షాలుగా ఉన్న బిజెపి, జనసేన నాయకులు అనుకుంటున్నట్టుగా పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతోంది.

వాస్తవానికి కూటమి కట్టింది… ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాత్రమే. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లి.. బలమైన శక్తిగా ఎదిగేందుకు, అవసరమైన దారులను వేసుకునే బాధ్యత ఏ పార్టీకి ఆ పార్టీకి ఉంటుంది. ఇందులో ఉమ్మడిగా పాలన మాత్రమే చేస్తారు.. తప్ప రాజకీయాలు చేయడానికి అవకాశం లేదు. ఎవరి రాజకీయం వారిది. ఎవరు ఓటు బ్యాంకు వారిది. అలాంట‌ప్పుడు ఉమ్మడిగా కలిసి ప్రజల మధ్యకు వెళ్లాలి అనేది మంచి పద్ధతి అయినా అలా వెళ్లాలనే నియ‌మ‌మైతే లేదు.

ఎందుకంటే ఒక అభిమాని ఒక పార్టీకి నచ్చొచ్చు. మరొక అభిమానికి ఇంకో పార్టీ నచ్చొచ్చు. కానీ ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, మంచి పనులు చేసుకున్న తర్వాత ఏ పార్టీకి ఆ పార్టీ తమ వంతు ప్రచారం చేసుకోవాలి. ఇందులో టిడిపి కాస్త ముందడుగు వేసింది. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇదే విధంగా జనసేన, బీజేపీ పార్టీలు కూడా సొంతంగా కార్యక్రమాలను అమలు చేసుకుంటే ఎవరు మాత్రం కాదన్నారు.

ఎవరు మాత్రం ఆపేయ‌మ‌న్నారు?. వారు అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండి ప్రజలకు దూరంగా ఉండి ఉంటే వారిదే తప్పు అవుతుంది తప్ప కూటమిలో ఉన్నంత మాత్రాన ఆ పార్టీలకు కూడా టిడిపి ఓటు బ్యాంకు సంపాదించి పెట్టాలని అన‌డం పొర‌పాటు. సంస్తా గతంగా బలోపేతం చేయాలని అనుకుంటే పొరపాటే కాబట్టి. టిడిపి చేసింది, ప్ర‌స్తుతం చేస్తున్న‌దీ త‌ప్పు కాదనేది మేధావుల నుంచి పరిశీల‌కుల వరకు చెబుతున్న మాట.