ఏపీలో అధికార కూటమికి ఏది పట్టినా బంగారమే అవుతోంది. ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా ఓ వేడుకను జరపాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారు. అయితే అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం, ఆ తర్వాత వరుసగా కురిసిన వర్షాలు… వెరసి జూన్ 12 తర్వాత గానీ సుపరిపాలనలో తొలి అడుగు సమావేశాన్ని నిర్వహించారు. అయితే తాజాగా బుధవారం నుంచి ఏపీలో ఆ ఒక్క రోజు వేడుక ఏకంగా నెల రోజుల పండుగగా మారిపోయింది. ఏడాదిలో ఏం చేశామన్నవిషయాన్ని ప్రజలకు చెప్పాలని, ఇందుకోసం కూటమి ఎమ్మెల్యేలు ఈ నెలాఖరుదాకా ఇంటింటికీ తిరిగి చెప్పాలని బాబు దిశానిర్దేశం చేశారు.
అందివచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటే మెరుగైన ఫలితం వస్తుందన్న విషయంలో బాబును మించిన వారు లేరు. అదే సమయంలో చేజారిన అవకాశాన్ని తిరిగి ఎలా అందిపుచ్చుకుకోవాలన్న విషయంలోనూ బాబుది అందె వేసిన చెయ్యే. వాస్తవానికి జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఓ పండుగ వాతావరణం కనిపించేలా ప్రణాళికలు రచించారు. అయితే ఘోర విమాన ప్రమాదంతో విజయోత్సవాను చంద్రబాబు రద్దు చేశారు. తాజాగా నాడు చేజారిన అవకావాన్ని ఇంటింటికీ టీడీపీ, సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఏకంగా నెల రోజుల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త తప్పనిసరిగా పాలుపంచుకోవాలన్న చంద్రబాబు ఆదేశాలతో కూటమి నేతలంతా నిన్నటి నుంచి గ్రామాల బాట పట్టారు. చివరాఖరుకు చంద్రబాబు కూడా తన సొంత నియోజకవర్గం కుప్పంలో స్వయంగా ఇంటింటికీ సుపరిపాలనలో తొలి అడుగులో పాలుపంచుకున్నారు. చంద్రబాబు ఉత్సాహం చూసి కుప్పం ప్రజలు ఉబ్బితబ్బిబ్బయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో పాలుపంచుకున్నారు. కూటమి పార్టీలకు చెందిన మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు, మిగిలిన 11 నియోజకవర్గాల్లో టీడీపీ ఇంచార్జీలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బుధవారం జరిగిన కార్యక్రమాన్ని పరిశీలిస్తే… మొత్తం 175 నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గంలోనూ ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత గానీ, నిరసన గానీ వ్యక్తం కాలేదు. అంతేకాకుండా తమ ఇళ్లకు వచ్చిన కూటమి పార్టీల నేతలకు ఆయా గ్రామాల ప్రజలు నుదుట బొట్టు పెట్టి మరీ స్వాగతం పలికారు. సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రజలంతా సంతృప్తి వ్యక్తం చేశారు. పెన్షన్ పంపిణీపై జనంలో హర్షాతిరేకం వ్యక్తమైంది. ఆయా సంక్షమ పథకాల అమలులో వివక్ష లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న తీరును జనం వేనోళ్ల పొగిడారు. గురువారం కూడా ఇదే తీరు కనిపించింది. ఈ లెక్కన ఈ నెలాఖరు దాకా ఏపీ గ్రామాల్లో పండుగేనని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates