‘ఖాకీ’ వదిలేసిన యంగ్ ఐపీఎస్… రీజనేంటి?

ఏపీలో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ వేడెక్కిపోతున్నాయి. విపక్షం వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీ పెద్దలు చెప్పినట్టుగా నడుచుకున్న ఐపీఎస్, ఐఏఎస్ లు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. అందులో భాగంగా బుధవారం ఏపీ పోలీసు శాఖలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. యంగ్ ఐపీఎస్ అదికారి సిద్ధార్థ్ కౌశల్ తన పోలీసు డ్యూటీని వదులుకున్నారు. ఈ మేరకు ఆయన స్వచ్ఛంద పదవీ వివరణ (వాలంటరీ రిటైర్ మెంట్ స్కీమ్-వీఆర్ఎస్)కు దరఖాస్తు చేసుకున్నారు.

2012 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన కౌశల్… ఏపీ కేడర్ పలు కీలక పోస్టులు చేపట్టారు. వైసీపీ అదికారం చేపట్టేదాకా నిఖార్సైన అధికారిగానే పేరు తెచ్చుకున్న ఆయన.. వైసీపీ హయాంలోనూ పెద్దగా ఆరోపణలు లేకుండానే రాణించారు. అయితే ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసులో ఆయన కట్టు తప్పారన్న వాదనలు ఉన్నాయి. నాటి విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా. ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన పీఎస్ఆర్ ఆంజనేయులులతో కలిసి వైసీపీ నేతలు చెప్పినట్టుగా నడుచుకుని చిక్కుల్లో పడ్డారు.

ఇక టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినంతనే జెత్వాని కేసును తిరగదోడిన పోలీసులు.. కౌశల్, రాణా, పీఎస్ఆర్ లపై కేసులు నమోదు చేసింది. అంతేకాకుండా ఈ ముగ్గురిని సస్పెండ్ చేసిన కూటమి సర్కారు రోజూ డీజీపీ కార్యాలయంలో సంతకం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులోనే ఇటీవలే పీఎస్ఆర్ అరెస్టు కాగా.. కౌశల్, టాటా కూడా అరెస్టు అవుతారన్న వాదనలు వినిపించాయి. అయితే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకుండా కౌశల్ కు డీజీపీ కార్యాలయంలో ఎస్పీ అడ్మిన్ పోస్టు ఇచ్చింది.

ఇదిలా ఉంటే… రాజకీయ ఒత్తిడుల కారణంగానే కౌశల్ తన పోలీసు ఉధ్యోగానికి వీడ్కోలు పలుకుతున్నారని బుధవారం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ తరహా ప్రచారం అంతకంతకూ పెరిగిపోతుండటంతో స్వయంగా కౌశల్ ఓ వివరణతో కూడిన ప్రకటనను విడుదల చేశారు. తన వీఆర్ఎస్ కు బయట జరుగుతున్న ప్రచారానికి ఏమాత్రం సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా కేవలం వ్యక్తిగత కారణాలతోనే తాను వీఆర్ఎస్ తీసుకుంటున్నానని తెలిపారు. ఇక ఏపీలో పనిచేయడం తనకు ఎంతగానో తృప్తినిచ్చిందని కూడా కౌశల్ చెప్పుకొచ్కారు.