తెలంగాణ ప‌ల్లెల్లో సంద‌డి స్టార్ట్‌!

తెలంగాణ‌లోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ సంద‌డి ప్రారంభ‌మైంది. రైతులు, యువ‌త‌, స్థానిక నాయ‌కులు కూడా సంద‌డిగా ఉన్నారు. ఇదేదో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన మేళ్ల‌ను చ‌ర్చించుకునేందుకు, ముఖ్యంగా రైతు భ‌రోసా వంటి నిధులు విడుద‌ల చేసినందుకు కాద‌ట‌. ప్యూర్‌గా.. పూర్తిగా.. స్థానిక ఎన్నిక‌ల కోస‌మేన‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల రాష్ట్ర హైకోర్టు గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించి తీరాల్సిందేన‌ని తేల్చి చెప్పింది. దీనికిగాను 90 రోజుల పాటు గ‌డువు కూడా విధించింది. అంటే.. 90 రోజుల్లోనే పంచాయ‌తీ ఎన్నిక‌లు పూర్తి చేయాల‌ని పేర్కొంది.

దీంతో గ్రామీణ ప్రాంతాల్లో సంద‌డి చోటు చేసుకుంది. దీంతోపాటు రాష్ట్ర ప్ర‌భుత్వం రిజ‌ర్వేష‌న్‌ను కూడా ఖ‌రారు చేయాల్సి ఉంది. దీనికి 30 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ నేప‌థ్యంలో స‌ర్కారు ఎలా స్పందిస్తుంద‌న్న‌ది కూడా స్థానికంగా చ‌ర్చ‌గా మారింది. వాస్త‌వానికి ఈ రిజ‌ర్వేష‌న్ల‌పై కొంత గంద‌ర‌గోళం నెల‌కొంది. బీఆర్ఎస్ హ‌యాంలో పాత రిజ‌ర్వేష‌న్లే అమ‌లు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత 2024లో ప్ర‌త్య‌క చ‌ట్టం తీసుకువ‌చ్చింది. గత డిసెంబరులో జరిగిన శాసనసభ సమావేశాల్లో కొత్తగా పంచాయతీరాజ్‌ చట్టం–2024 బిల్లును ఆమోదించారు.

దీని ప్రకారం స్థానికంగా జ‌రిగే ఎన్నికల్లో ఒకసారి మాత్రమే రిజర్వేషన్‌ వర్తించనుంది. దీంతో లోక‌ల్‌గా ఉన్న‌ స్థానాలకు రిజర్వేష న్లు మారనుండ డంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. మ‌రోవైపు రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం 42 శాతం బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. దీనిపై కూడా ఉత్కంఠ కొన‌సాగుతోంది. ఇది రాష్ట్ర‌ప‌తి ప‌రిధిలో ఉంది. దీనిపై క్లారిటీ కోసం స‌ర్కారు వెయిట్ చేస్తోంది. ఇది అమ‌లైతే.. స్థానికంగా బీసీల‌కు మ‌రింత అవ‌కాశం ఉంటుంది. ఇదికూడాగ్రామీణ ప్రాంతంలో చ‌ర్చ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించింది.

పార్టీలు అప్ర‌మ‌త్తం!

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పార్టీల‌కు నేరుగా ప్రాతినిధ్యం ఉండ‌దు. అయిన‌ప్ప‌టికీ.. త‌మ‌కు సానుకూలంగా ఉండే వారిని చూసుకుని పార్టీలు ప‌రోక్షంగా మ‌ద్ద‌తివ్వ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలో గ్రామాల్లో యువతను, ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌, కొన్ని చోట్ల బీజేపీ నాయ‌కులు కూడా ఉన్నారు. తమకు అనుకూలంగా ఇప్పటి నుంచే మౌత్‌టాక్‌ ప్రజల్లోకి వెళ్లేలా అనుచరులను సమాయత్తం చేస్తున్నారు. గ్రామాలు, వార్డులవారీగా అర్హులు, సమర్థులు ఎవరన్నదానిపై కీల‌క నేత‌లు కూపీ లాగుతున్నారు. దీంతో గ్రామీణ తెలంగాణ‌లో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది.