రాంజీ రాక‌కు స‌ర్వం సిద్ధం.. బాబు కూడా మౌనం!

అధికార వైసీపీ గూటికి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ మాగంటి వెంక‌టేశ్వ‌ర‌రావు ఉర‌ఫ్ మాగంటి బాబు కుమారుడు, ప్ర‌స్తుత టీడీపీ జిల్లా యువ‌త అధ్య‌క్షుడు మాగంటి రాంజీ రానున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే గ్రౌండ్ వ‌ర్క్ పూర్త‌యింద‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న మాగంటి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో అనేక ప‌ద‌వులు అలంక‌రించింది. అదేస‌మ‌యంలో టీడీపీలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా ఎంపీగా బాబు చ‌క్రం తిప్పారు. ఇటు కృష్ణా, అటు పశ్చిమ గోదావ‌రిలోనూ ఆయ‌న దూకుడు చూపించారు. మంచి పేరు ను సంపాయించుకున్నారు.

అయితే, మాగంటి బాబుకు అనారోగ్యం కార‌ణంగా.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లోనే రాంజీని పోటీకి దింపాల‌ని భావిం చారు. కానీ, చంద్ర‌బాబు ఈ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించ‌డంతో మాగంటి బాబు ఏలూరు నుంచి ఎంపీగా మ‌రోసారి రంగంలోకి దిగారు. అయితే, వైసీపీ దూకుడు ముందు ఆయ‌న నిల‌వ‌లేక‌పోయారు. ఆ త‌ర్వాత పార్టీ ప‌రంగా ఆయ‌న‌కు సంబంధాలు త‌గ్గుతూ వ‌చ్చాయి. పార్టీలో త‌న‌కు ప్రోత్సాహం క‌రువ‌వుతోం ద‌ని.. త‌న కుమారుడి భ‌విత‌వ్యాన్ని తేల్చాల‌ని కూడా బాబు.. అనేక సార్లు పార్టీ అదినేత చంద్ర‌బాబుకు లేఖ‌లు రాశారు. అయితే.. చూద్దాం.. చేద్దాం.. అనే ధోర‌ణిలోనే చంద్ర‌బాబు సాగ‌దీశారు.

ఇటీవ‌ల పార్టీ ప‌ద‌వుల్లోనూ కీల‌క పొజిష‌న్ ఆశించినా.. చంద్ర‌బాబు అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఇక‌, అప్ప‌టికే.. వైసీపీ వైపు చూస్తున్న రాంజీ.. మంత్రి ఆళ్ల నాని వ‌ర్గంగా గుర్తింపు పొందారు. ఆయ‌న‌తో సంబంధాలు నెరుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే రాంజీకి ప్రాధాన్యం ఇచ్చేలా.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంత‌నాలు కూడా పూర్త‌య్యాయ‌ని చెబుతున్నారు. టీడీపీకి చెందిన క‌మ్మ సామాజిక వ‌ర్గం నేత‌ల‌ను వైసీపీలోకి తీసుకునేలా ఇప్ప‌టికే ఒక ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకున్న జ‌గ‌న్‌.. ఈ క్ర‌మంలోనే గ‌తంలో విజ‌య‌వాడ‌కు చెందిన దేవినేని అవినాష్‌ను పార్టీలోకి తీసుకున్నారు.

ఆయ‌నకు విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. కోరిన‌ప్పుడ‌ల్లా అప్పాయింట్‌మెంటు ఇస్తున్నారు. ఇలానే ఇప్పుడు రాంజీకి కూడా ప్రాధాన్యం ఇచ్చేందుకు ఆయ‌న ఉత్సాహం చూపుతున్నారు. స్థానిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో యువ‌త‌ను ప్రోత్స‌హించ‌డం ద్వారా.. పార్టీని ప‌రుగులు పెట్టించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. జ‌న‌వ‌రిలోపు రాంజీ పార్టీ మారే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇక‌, చంద్ర‌బాబు కూడా మాగంటి కుటుంబంపై మౌనం పాటించ‌డం గ‌మ‌నార్హం.