వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలుచేశారు. కూటమి ప్రభుత్వ పాలన చూసిన తర్వాత.. జగన్కు నిద్రపట్టడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని తనకు కొందరు చెప్పారన్న ఆయన.. కూటమి పాలనలో పార దర్శకత, జవాబుదారీ తనం చూసి.. వైసీపీ నాయకులు బెంబేలెత్తుతున్నారని చెప్పారు. ఇలాంటి పాలనను ప్రజలు వదులు కోరని తెలిసి.. ఏం చేయాలో తెలియక తాడేపల్లి కొంపలో జాగారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం.. సీఎం చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలోని మలకపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా పింఛన్లను ఆయన పంపిణీ చేశారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘సూపర్ 6’ హామీలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నామని చెప్పారు. అయితే.. కొందరు సూపర్ 6 హామీలపై అవాకులు చవాకులు పేలారని పరోక్షంగా వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. సూపర్ 6ను అమలు చేయలేమని చెప్పారని.. కానీ, వీటిని అమలు చేస్తుండడంతో వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెప్పారు. ఇప్పటికే పింఛన్లను రూ.1000 చొప్పున పెంచి ఇస్తున్నామని.. గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నామని చెప్పిన చంద్రబాబు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మరో 45 రోజల్లోనే అమలు చేయనున్నట్టు తెలిపారు.
ఇవన్నీ చూశాక.. వైసీపీ నాయకులకు నిద్ర పట్టడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దోచుకోవడం.. దాచుకోవడానికి అలవాటు పడిన వారికి ఇప్పుడు పారదర్శక పాలన అందిస్తుంటే నిద్ర ఎలా పడుతుందని ఎద్దేవా చేశారు. సామాజిక భద్రతా పింఛన్లకు నెలా నెలా రూ.2750 కోట్ల ను ఖర్చు చేస్తున్నామని.. వీటిని పారదర్శకంగా అందిస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పారదర్శకతను పాతిపెట్టిందని.. పింఛన్లను కూడా సరిగా అందించలేక పోయిందని చంద్రబాబు విమర్శించారు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచి అనేక పథకాలను ఎగ్గొట్టారని.. అప్పటికి కూడా అప్పులు పెట్టి పోయారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో కూటమి బలంగా ఉందన్న చంద్రబాబు.. ప్రజలకు మేలు చేసేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నా రు. ప్రజలకు సంక్షేమం ఆగబోదని.. అదేసమయంలో అభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తామని చెప్పారు. దీనిని చూసి పొరుగు రాష్ట్రాల వారు కూడా నేర్చుకుంటున్నారని తెలిపారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వస్తే.. ఇక, రాష్ట్రం పేరు ప్రపంచ పటంలోకి ఎక్కుతుందని చంద్రబాబు చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates