సిగాచీ యాజమాన్యానికి ఎందుకింత నిర్లక్ష్యం..?

తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు పటాన్ చెరు పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో కార్యకలాపాలు సాగిస్తున్న సిగాచీ కెమికల్ కంపెనీపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిగాచీలో సోమవారం ఉదయం భారీ రియాక్టర్ పేలగా.. ప్రమాదంలో ఇప్పటిదాకా 39 మంది చనిపోగా… 35 మంది చికిత్స పొందుతున్నారు. ఇక ఇంకో 43 మంది కంపెనీ కార్మికుల జాడే తెలియడం లేదు. ప్రమాదం జరిగి బుధవారం ఉదయానికి 48 గంటలు పూర్తి కానుంది. అయినా కూడా కంపెనీ యాజమాన్యం నుంచి ఇప్పటిదాకా చిన్న ప్రకటన కూడా విడుదల కాలేదు.

సిగారీ కంపెనీ యాజమాన్యం గురించిన వివరాల్లోకి వెళ్లితే… ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని ఆ రాష్ట్ర వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ కు చెందిన బడా పారిశ్రామికవేత్తల కుటుంబం ఈ కంపెనీని నడుపుతోంది. ఈ కంపెనీకి దాదాపుగా 40 ఏళ్ల ప్రస్థానం ఉంది. హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా మరో 3 యూనిట్లు ఈ కంపెనీకి ఉన్నాయి. ఇదే విషయాన్ని మంగళవారం ఉదయం ప్రమాద స్థలిని పరిశీలించిన సందర్బంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. కంపెనీకి ఇంకా యూనిట్లు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ రావడం కాస్త ఆలస్యం అయ్యిందని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక సిగాచీ తయారు చేస్తున్న కెమికల్ ఉత్పత్తులు ప్రపంచంలోని చాలా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.500 కోట్లకు పైగానే ఉందని సమాచారం. ఈ లెక్కన ఈ కంపెనీ ఏ రకంగా చూసినా చిన్న కంపెనీ ఏమీ కాదు. ఏళ్ల తరబడి కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీ ద్వారా యాజమాన్యం భారీ ఎత్తున లాభాలు గడించి ఉంటుందని కూడా విశ్లేషణలు సాగుతున్నాయి. ఇంత సమర్థత ఉండి, ఆర్థిక వనరులు ఉండి కూడా ఆ కంపెనీ యాజమాన్యం ఎందుకు ఇంకా దోబూచులాడుతోందన్నది అర్థం కాని ప్రశ్న.

కంపెనీ యాజమాన్యం నుంచి స్పందన లేని తీరును చూసి మంగళవారం ఉదయం ప్రమాద స్థలిని సందర్శించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీకి సంబంధించి అందుబాటులో ఉన్న ప్రతినిదులతో మాట్లాడిన ఆయన మరింతగా ఆగ్రహానికి గురయ్యారు. వెరసి కంపెనీ యాజమాన్యంపై తక్షణమే కేసు నమోదు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేయగా… మంగళవారం మధ్యాహ్నమే కేసు నమోదు అయిపోయింది. ఇక బుధవారం కూడా యాజమాన్యం నుంచి స్పందన లేకపోతే మాత్రం కంపెనీ ఆస్తులను సీజ్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.