ఎవరిని ఎవరు వదిలేశారు ?

ఈ విషయమే తెలుగుదేశంపార్టీలో ఎవరికీ అర్ధం కావటం లేదు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పార్టీ అధికారానికి దూరమైనా మాజీ మంత్రి, సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు మాత్రం వైజాగ్ లో గెలిచారు. ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండే గంటా తనదైన రాజకీయం మొదలుపెట్టేశారు. టీడీపీకి రాజీనామా చేస్తారని, వైసీపీలో చేరుతారనే ప్రచారం గంటా విషయంలో జరిగినట్లుగా మరే టీడీపీ నేతపైనా జరగలేదంటే అతిశయోక్తి కాదు.

మరి తన వ్యవహారశైలి వల్ల గంటానే అలాంటి ప్రచారం చేయించుకున్నారో లేకపోతే మీడియానే అత్యుత్సాహం చూపించి ఈ మాజీ మంత్రికి ప్రచారం కల్పిస్తోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఈ దశలోనే ముందు గంటా కొడుకు వైసీపీ కండువా కప్పేసుకోబోతున్నట్లు ఒక్కసారిగా మొదలైన ప్రచారం అంతే తొందరగా చల్లారిపోయింది. ఈ నేపధ్యంలోనే చంద్రబాబునాయుడు పార్టీ పదవులను భర్తీ చేయబోతున్నట్లు సంకేతాలిచ్చారు.

సంకేతాలు పంపినట్లే ముందుగా జాతీయ కమిటి, పాలిట్ బ్యూరోను నియమించారు. తాజాగా రాష్ట్ర కమిటిని కూడా నియమించారు. అయితే మూడు కమిటిల్లో దేనిలోను గంటా పేరు కనబడలేదు. దీంతో చంద్రబాబే మాజీమంత్రిని దూరం పెట్టారా లేకపోతే గంటానే పార్టీకి దూరంగా ఉన్న కారణంగా ఏ కమిటిలోను చోటు దక్కలేదా ? అన్నదే మిగిలిన నేతలకు అర్ధం కావటం లేదు. ఎందుకంటే తమకు కమిటిల్లో చోటు కల్పించలేదని చాలామంది నేతలు అలిగారు. చంద్రబాబుకు తన నిరసనను లేఖల రూపంలో అందించారు కూడా.

అలిగిన నేతలను, అసంతృప్తితో ఉన్న నేతల్లో కొందరితో చంద్రబాబు నేరుగానో లేకపోతే ఫోన్లోలోనో మాట్లాడారు. అయితే గంటాతో మాత్రం చంద్రబబు మాట్లాడేందుకు కనీసం ప్రయత్నించను కూడా లేదట. ఎందుకంటే తన పేరు ఏ కమిటిలో లేకపోయినా గంటా కూడా పెద్దగా స్పందించలేదట. పార్టీలోని మిగిలిన నేతలతో కూడా పెద్దగా కలవటం లేదని సమాచారం. అందుకే పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కనబడటం లేదు. దాంతో పార్టీయే గంటాను వదిలేసిందా ? లేకపోతే గంటాయే పార్టీని వదిలేశారా ? అన్నదే అర్ధం కావటం లేదట.