ఏపీలోని కూటమి ప్రభుత్వ రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) విస్తృత స్థాయి సమావేశం ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సుదీర్ఘంగా సాగింది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు తదితరులంతా హాజరు కావాలని పార్టీ అధిష్ఠానం ఒకింత గట్టిగానే చెప్పింది. అయితే ఇతర వర్గాల వారు బాగానే హాజరైనా.. ఎమ్మెల్యేల కోటాలో మొత్తం 135 మంది ఉంటే..వారిలో ఏకంగా 56 మంది సమావేశానికి గైర్హాజరయ్యారట. అంతేనా వచ్చిన వారిలోనూ కొందరు సంతకాలు చేసి ఆ తర్వాత చిన్నగా జారుకున్నారట.
జూన్ 2 నుంచి మంచి ప్రభుత్వం పేరిట… సుపరిపాలనలో తొలి అడుగు పేరిట కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, సూపర్ సిక్స్ లు అమలు చేసిన హామీలు, ఇతరత్రా సంక్షేమ పథకాల అమలు తీరుపై ఇంటంటికీ తిరిగి ప్రచారం చేయాలన్న ఉద్దేశ్యం చంద్రబాబు ఆ బృహత్కార్యాన్ని చేపట్టారు. జూలై 2 నుంచి నెలాఖరు వరకు నాన్ స్టాప్ గా కొనసాగనున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని కూడా పార్టీ దిశానిర్దేశం చేసింది. ఈ లెక్కన ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యం కలిగినదే. ఇంతటి ప్రాధాన్యం కలిగిన సమావేశానికి ఏకంగా 56 మంది ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమావేశానికి గైర్హాజరైన వారిలో ఓ 15 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం దేశంలోనే లేరట. విదేశీ పర్యటనల్లో వారు తలమునకలై ఉన్నారట. వీరు దేశానికి ఎప్పుడు తిరిగి వస్తారో కూడా తెలియదట. ఇక సమావేశానికి హాజరైన వారిలోనూ కొందరు సంతకాలు చేసి అటు నుంచి అటే జారుకున్న వైనం కూడా చంద్రబాబు దృష్టిని దాటిపోలేదు. దాదాపుగా 7 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ సమావేశంలో ఇంటింటికీ మంచి ప్రభుత్వం పేరిట చేపట్టనున్న కార్యక్రమంలో చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమయంలో ఆయన ఈ గైర్హాజరీని ప్రస్తావించలేదు.
ఈ సమావేశం ముగిసిన వెంటనే గైర్హాజరీ లిస్టును ప్రస్తావించిన చంద్రబాబు డుమ్మా కొట్టిన నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికి మంచి ప్రభుత్వం లాంటి కీలక కార్యక్రమానికి సన్నాహకంగా నిర్వహిస్తున్న ఇంతటి కీలక సమావేశానికి ఇంత మంది ఎమ్మెల్యేలు గైర్హాజరైతే ఎలాగని ప్రశ్నించారు. అంతేకాకుండా గెలిపించిన ప్రజలకు సేవ చేయకుంటే…మరుసటి ఎన్నికల్లోనే ఫలితం అనుభవించి తీరాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక ఎక్కువకాలం విదేశాల్లో పర్యటించడం కూడా సబబు కాదని బాబు సూచించారు. ఇక సమావేశానికి వచ్చి మరీ సంతకాలు చేసి జారుకున్న వారి జాబితా తన వద్ద ఉందని, త్వరలోనే వారి పనిబడతానని చంద్రబాబు వార్నింగ్ ఇచ్కారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates