జ‌గ‌న్‌…. రెడ్డి మంత్రం ..!

రెడ్డి సామాజిక వర్గాన్ని సమీకరించడంలో వైసిపి తర్జనభర్జన పడుతోందన్న మాట వినిపిస్తోంది. నిజానికి కులం లేదు మతం లేదు అని చెప్పుకున్న జనసేనలో సామాజిక వర్గాల సమీకరణ బాగుంటే.. రెడ్లకు ప్రాధాన్యం ఇచ్చిన వైసీపీలో ఇప్పుడు వారే దూరంగా ఉన్నారు. వాస్తవానికి పైకి జనసేన మతం లేదు కులం లేదు అని చెప్పుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కాపుల్లో నెలకొన్న బలమైన సింపతీని ఒడిసి పట్టుకుని గత ఎన్నికల్లో క్షేత్రస్థాయి రాజకీయాలను సామాజిక వర్గాల ఆధారంగానే పరుగులు పెట్టించింది. ఫలితంగా కాపులందరూ ఐక్యమయ్యారు.

గత విభేదాలను కూడా మరిచిపోయి ఇతర సామాజిక వర్గాలతో కలివిడిగా ముందుకు సాగారు. వైసిపి విషయానికి వస్తే జగన్ను గెలిపించుకోకపోతే రెడ్డి సామాజిక వర్గానికి భవిష్యత్తు లేదని భావించిన ఆ సామాజిక వర్గం 2019 ఎన్నికల్లో ఐక్యంగా నిలబడి జగన్ కోసం పని చేసింది. ఇది వైయస్ రాజశేఖర్ రెడ్డి 2004లో చేసిన పాదయాత్రను మించి రెడ్ల మధ్య ఐక్యతను తీసుకొచ్చింది. కానీ ఈ ఐక్యతను రెడ్డి సామాజిక వర్గం సింప‌తీని కాపాడుకోవడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారు.

గడిచిన ఐదు సంవత్సరాల్లో అధికారికంగా సీఎం హోదాలో ఉండి ఒక్కసారి కూడా ఆయన రెడ్డి సామాజిక వర్గంతో భేటీ కాలేదు. అంతేకాదు రెడ్డి సామాజిక వర్గం అంచనాలను కూడా అందుకోలేకపోయారు. వారేమీ పూర్తిగా మంత్రివర్గాన్ని రెడ్లమయం చేయమని కానీ అన్ని పదవులు రెడ్డి సామాజివర్గానికి ఇవ్వమని గాని కోరలేదు. వ్యాపార పరంగా ఇతర అంశాల పరంగా తమకు వెసులుబాటు కల్పించాలని కోరుకున్నారు. ఇది సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్న ఆ సామాజిక వర్గాలు కోరుకుంటాయి.

ఈ విషయాన్ని గమనించి కూడా జగన్ విస్మరించారా, లేక ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఓటు బ్యాంకు తనను కాపాడుతుందని అంచనా వేసుకున్నారా, లేక మహిళా ఓటు బ్యాంకు తన రక్షిస్తుందని అనుకున్నారా అనేది పక్కన పెడితే మొత్తానికి రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రం ఆయన దూరం చేసుకున్నారు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గం విలువ తెలిసి వచ్చింది. రెడ్లు కనక కలివిడిగా ఉండి ఉంటే ఏదో ఒక రకంగా పార్టీ గెలిచి ఉండేది. కానీ రెడ్డి సామాజిక వర్గమే కక్ష కట్టినట్టుగా వ్యవహరించి వైసిపి పరాజ‌యానికి కారణమైంది.

మా నాయకుడే మమ్మల్ని పట్టించుకోలేదు అన్న ధోరణ కనిపించింది. ఇది ప్రత్యర్థ టీడీపీకి బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే ఎక్కడ సింపతి ఉంటే అక్కడ ఓట్లు ఉంటాయన్న కీలక సూత్రం చంద్రబాబు కు తెలుసు కాబట్టే దీనిని ఆయన చక్కగా వినియోగించుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసిపికి ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఓటు బ్యాంకు ఎలా ఉన్నా… రెడ్ల సామాజిక వర్గం మద్దతు మాత్రం కచ్చితంగా అవసరం. వారిని తన వైపు నిలుపుకునే దిశగా ఆయన అడుగులు వేయాలి. వారిని కూర్చోబెట్టి మాట్లాడాలి. వారి సమస్యలు తెలుసుకోవాలి. భవిష్యత్తును నిర్దేశం చేసుకోవాలి. లేకపోతే సామాజిక వర్గాల ఆధారంగా ఆధారపడిన రాజకీయాలు వైసిపికి ఎదురు తిరగడం ఖాయం.