ఫోన్ ట్యాపింగ్ విచారణలో ఏబీఎన్ రాధాకృష్ణ ఎం చెప్పారు?

తెలంగాణలో పెను కలకలమే రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. ఇలా బయటకు వస్తున్న విషయాలను చూస్తుంటే… సమాజంలోని ఏ ఒక్క వర్గాన్ని కూడా నిందితులు వదలలేదని చెప్పక తప్పదు. తాజాగా శుక్రవారం వెలుగు చూసిన అంశంలో మీడియా సంస్థల అధినేతలను కూడా నిందితులు వదలలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రముఖ మీడియా సంస్థగా కొనసాగుతున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఫోన్ నూ నిందితులు ట్యాప్ చేశారు. ఈ మేరకు సిట్ నోటీసుల మేరకు రాధాకృష్ణ తన వాంగ్మూలాన్ని ఇచ్చారు.

2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొదలైందని ఇప్పటికే స్పష్టం అయిపోయింది. నాడు అదికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు ఆదేశాలతోనే నాటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఓ ప్రత్యక బృందాన్ని ఏర్పాటు చేసుకుని తన బాస్ లు ఇచ్చిన ఫోన్ నెంబర్లన్నింటినీ ట్యాప్ చేసి వాటి వివరాలను బాస్ లకే అందించారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన కీలక రాజకీయ వేత్తలతో పాటుగా కొందరు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక కొందరు పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, చివరాఖరుకు మీడియా సంస్థల అదినేతలూ ఉన్నారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే శ్రవణ్ రావు అనే ఓ మీడియా సంస్థ అధినేతను సిట్ ప్రశ్నించింది. అయితే ఈయన ఫోన్ ట్యాపింగ్ నిందితుడు. అయితే ఇప్పుడు ఏబీఎన్ రాధాకృష్ణ మాత్రం బాధితుడిగా సిట్ ముందు తన స్టేట్ మెంట్ ఇచ్చారు. ఎస్ఐబీ వద్ద ఉన్న ఫోన్ నెంబర్ల జాబితాను పరిశీలించగా… రాధాకృష్ణ పేరు కూడా కనిపించడంతో షాక్ తిన్న సిట్ అదికారులు వెంటనే విషయాన్ని రాధాకృష్ణకు తెలియజేశారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో స్టేట్ మెంట్ ఇవ్వాల్సి ఉందని, విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల ఆధారంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన రాధాకృష్ణ ఓ గంటపాటు తన స్టేట్ మెంట్ ను ఇచ్చి వెళ్లారు.