ప్రతిపక్షం వైసీపీ పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికలకు నాలుగు సంవత్సరాల ముందు నుంచే ప్రజల మధ్యకు వచ్చేందుకు టార్గెట్ పెట్టుకుంది. దీంతో ప్రజలను మరింత చైతన్య పరిచి.. పుంజుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ప్రారంభించింది. దీనిని పసిగట్టిన చంద్రబాబు గట్టి వార్నింగే ఇస్తున్నారు. ఆ భూతాన్నిపాతిపెట్టేస్తాం.. ఇక, ఎప్పటికీ ఆ భూతం బయటకు రాదని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఇంతగా చంద్రబాబుకు కాన్ఫిడెంట్ ఎలా వచ్చిందన్నది ప్రశ్న.
ఎందుకంటే.. సహజంగా ప్రతిపక్షం పుంజుకోవడం అనేది కామనే. ఇది అన్ని రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. తెలంగాణలో కూడా.. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ హవా పెరిగిందని కొన్నాళ్ల కిందట జరిగిన సర్వేలు తేల్చి చెప్పాయి. ఇలానే ఏపీలోనూ ప్రతిపక్షం పుంజుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే చేసిన సర్వేలు.. ఇతరత్రా అంచనాలను బట్టి.. వైసీపీ పుంజుకుంటోందనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా జగన్ జనంలో ఉంటే.. ఆ ఎఫెక్ట్ వేరుగా ఉంటోందని కూడా అంటున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు.. స్పందన ప్రాధాన్యం దక్కించుకుంది. పెట్టుబడులు ఇప్పుడిప్పుడే వస్తుండడంతోపాటు.. సంస్థల ఏర్పాటు కూడా వడివడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సంస్థలు ఏర్పాటు చేసేవారు వైసీపీ మళ్లీ వస్తుందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారన్నది సీఎం మాట. దీంతోనే ఆయన భూతాన్ని పడుకోబెట్టేశామని.. ఇక లేవదని కూడా చెబుతున్నారు. మరి ఇంత కాన్ఫిడెంట్ ఎలా వచ్చింది? వైసీపీ విషయంలో ఇంత కరాఖండీగా ఎలా చెబుతున్నారన్నది ప్రశ్న.
దీనికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 1) ఏ సంక్షేమ పథకాలు అయితే.. వైసీపీని తిరిగి గెలిపిస్తాయన్న అంచనా ఉందో.. అదే సంక్షేమాన్ని ఎంత ఖర్చయినా చంద్రబాబు అమలు చేస్తున్నారు. దీంతో వైసీపీకి చోటు ఉండదని భావిస్తున్నారు. 2) ఎస్సీ, ఎస్టీలకు మేలు చేశామని చెబుతున్న వైసీపీకి షాకిచ్చేలా.. తను కూడా.. వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే 30 కోట్ల రూపాయలను పాస్టర్లకు ఇచ్చారు. దీంతో ఆయా వర్గాలు కూడా సంతృప్తిగా ఉన్నారు.
3) వైసీపీ దూరం పెట్టిన అభివృద్ధిని చంద్రబాబు భుజాన వేసుకున్నారు. రహదారులు.. మౌలిక సదుపాయాలు, ఉపాధి, ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ మూడు ప్రధాన కారణాలతోనే చంద్రబాబు వైసీపీ ఇక పుంజుకోదన్న కాన్ఫిడెంట్తో ఉన్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates