ప్రచారం మంచిదే.. కానీ.. వికృత ప్రచారం.. అది కూడా పరాకాష్ఠకు చేరితే.. అది తీవ్ర పర్యవసానాలకు దారి తీస్తుంది. ఇప్పడు వైసీపీ విషయంలోనూ అదే జరిగింది. తాజాగా టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు సుగవాసి బాలసుబ్రమణ్యం వైసీపీ జెండా కప్పుకొన్నారు. దీనిని ఎవరూ తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఎవరి రాజకీయ జీవితం వారిది. ఎక్కడ బాగుంటుందని అను కుంటే అక్కడకు వెళ్తారు. ఎవరి వేదిక వారిది. అయితే..ఇదే అదునుగా వైసీపీ సోషల్ మీడియా మరో వికృత ప్రచారానికి తెరదీసింది. టీడీపీ సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కార్నర్ చేస్తూ.. కామెంట్లు కుమ్మేసింది.
ఇంకేముంది.. దేవినేని కూడా వైసీపీ చెంతకు వచ్చేస్తున్నారని.. ఆయనకు కూడా జగన్ కండువా కప్పేస్తున్నారని సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు జోరుగా ప్రచారం చేశారు. మీమ్స్తోనూ రఫ్పాడించారు. అంతేకాదు.. సమయం చూసుకుని అన్నట్టుగా.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్పై విమర్శలు గుప్పించారు. వారిద్దరూ దేవినేనికి అన్యాయం చేశారని.. గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసినా(మైలవరం టికెట్) ఇప్పటి వరకు గుర్తింపులేకుండా చేశారని వ్యాఖ్యానించారు. దీంతో దేవినేని కుమిలి పోతున్నారని చెప్పుకొచ్చారు. ఈ బాధభరించలేక.. దేవినేని.. తమ వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
అయితే.. ఈ వ్యాఖ్యల విషయంలో దేవినేని స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. వైసీపీపై నిప్పులు చెరిగారు. రేపో మాపో జైలుకు వెళ్లే జగన్ పార్టీలో ఎవరు మాత్రం చేరతారని ఆయన ప్రశ్నించారు. అసలు తను టీడీపీని ఎందుకు వదిలేయాలని ఆయన ప్రశ్నించా రు. అంతేకాదు.. పార్టీలో తనకు సముచిత స్థానం ఉందని.. ఓ కార్యకర్తగా పార్టీలోనే ఉంటానని తేల్చి చెప్పారు. పదవుల కోసమే పార్టీలో ఉండాలంటే.. రాష్ట్రంలోని కోటి మంది కార్యకర్తలకు చంద్రబాబు పదవులు ఎక్కడ నుంచి తెచ్చి ఇస్తారో వైసీపీ చెప్పాలన్నారు.
అంతేకాదు.. ముందు మీ సంగతి చూసుకోవాలని వ్యాఖ్యానించారు. ఇప్పటికే చాలా మంది జంప్ చేశారని.. కీలక నాయకులు కూడా దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ నేతల నోటికి తాళం పడింది. అయితే.. ఈ నెల 23న కూడా ఇలానే ప్రచారం చేసిన నేపథ్యంలో అప్పట్లోనూ దేవినేని రియాక్ట్ అయ్యారు. తాజాగా మరోసారి ఆయనపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరోసారి స్పందించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates