యువ‌త లేని పోరు.. వైసీపీకి భారీ షాక్ ..!

ఇప్పటికిప్పుడు వైసీపీలో మార్పులు తప్ప‌వా..? అంటే తప్పవనే చెబుతున్నారు పరిశీలకులు. దీనికి కారణం తాజాగా వైసీపీ అధినేత ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రంలో నిర్వహించిన యువత పోరు భారీగా విఫలం అవ్వటమే. దీనిపై వైసీపీ చాలానే ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు 1500 రూపాయలు చొప్పున ఇస్తామని అది కూడా ఇవ్వడం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

అయితే వీటిని ఆసరా చేసుకుని, నిరసనలు తెలపడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను పెంచాలనేది వైసీపీ రాజకీయ వ్యూహం. దీనినేమి తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారని ఎవరూ ఊహించరు. కాబట్టి జగన్ చేసింది తప్పు కాదు. అయితే దీనికి ఎంత స్పందన వచ్చింది.. ఏ మేరకు సక్సెస్ అయింది.. అనేది చూసుకుంటే మాత్రం వైసిపి పూర్తిగా విఫ‌ల‌మైందనేది కనిపించింది. దీనికి స‌మ‌స్థాగతంగా చాలా తప్పులు కనిపించాయి.

ముఖ్య నాయకులు అందరూ దూరంగా ఉండడం, గుంటూరు, ప్రకాశం జిల్లాలో నాయకులు లేకపోవడం ఉభ‌య‌ గోదావరి జిల్లాల్లో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం, మరికొందరు జైల్లో ఉండడం, ఇంకొందరు కేసులు చుట్టూ తిరగడంతో ఈ కార్యక్రమానికి జన సమీకరణ గానీ.. యువ సమీకరణ గాని చేయలేకపోయారనేది స్పష్టంగా కనిపించింది. కొన్ని జిల్లాల్లో మహిళలను, వృద్ధులను తీసుకురావడం మరీ దారుణం. ఒక రకంగా చెప్పాలంటే యువత పోరు విఫలమైంది అనేది సొంత పార్టీలోనే వినిపిస్తున్న మాట.

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ముఖ్యంగా పొదిలి, గుంటూరు జిల్లా రెంటపాళ్ల ఘటన‌ల నేపథ్యంలో వైసీపీకి కొంత ఊపు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి అప్పటికప్పుడు రూపకల్పన చేశారు. కానీ దీనిని సక్సెస్ చేయడంలో నాయకులు చొరవ చూపలేకపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు జరుగుతున్నాయి. మరి ఈ విషయం వైసిపి నాయకులకు తెలుసు అనుకోవాలా తెలియదనుకోవాలో అర్థం కాదు. ఈ సమయంలో ఎక్కడైనా యువత బయటకు వస్తారా?.

మరోవైపు పోలీసుల నుంచి కూడా కేసులు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో వైసిపి ఇలాంటి అతిపెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం సరికాదనేది పరిశీలకులు చెబుతున్న మాట. భవిష్యత్తులో ఏదైనా కార్యక్రమం చేపట్టేటప్పుడు కచ్చితంగా అప్పటికి ఉన్న ప్రరిణామాలను అంచనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాల్సి ఉంటుందని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.