ఎన్నికల్లో గెలిచింది కూటమి పార్టీలు కాదు… : నారా లోకేష్

గ‌త 2024లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూటమి పార్టీలు కాదు, ప్ర‌జ‌లే గెలిచార‌ని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. వైసీపీ హ‌యాంలో ఐదు సంవ‌త్స‌రాలు.. బిక్కు బిక్కు మంటూ ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని గ‌డిపిన ప్ర‌జ‌లు కూట‌మి వైపు ఏక‌ప‌క్షంగా నిలిచార‌ని తెలిపారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. వారంతా సుఖ శాంతుల‌తో జీవిస్తున్నార‌ని పేర్కొన్నారు. వైసీపీ హ‌యాంలో ప్ర‌శ్నించినా.. స‌మ‌స్య ల‌పై స్పందించినా… లాఠీలు విరిగాయ‌ని.. జైళ్లు నిండిపోయాయ‌ని అన్నారు. అందుకే ప్ర‌జ‌లు మార్పు కోరుకున్నార‌ని.. అదే గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ను గెలిపించేలా చేసింద‌ని నారా లోకేష్ అన్నారు.

అమ‌రావ‌తిలో సోమ‌వారం సాయంత్రం నిర్వ‌హించిన `సుప‌రిపాల‌న‌లో తొలి అడుగుకు ఏడాది` కార్య‌క్ర‌మంలో మంత్రి లోకేష్ మాట్లాడారు. నియంత పాల‌న నుంచి ప్ర‌జ‌ల‌కు నిజ‌మైన స్వ‌తంత్రం ల‌భించింద‌న్నారు. కూట‌మి ప్ర‌బుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. రాష్ట్రంలో సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను దేశంలోని ఏ రాష్ట్రం ఇవ్వ‌నంతగా పెంచి రూ.4000 చొప్పున అందిస్తున్నామ‌న్నారు. దివ్యాంగుల‌కు రూ.6000 చొప్పున ఇస్తామ‌ని చెప్పారు. `త‌ల్లికి వంద‌నం` పేరుతో అమ‌లు చేస్తున్న సూప‌ర్ సిక్స్ ప‌థ‌కంలో ఎంత మంది త‌ల్లులు ఉన్నా అంద‌రికీ రూ.13000 చొప్పున ఇచ్చామ‌ని, 1వ త‌ర‌గ‌తి నుంచి ఇంట‌ర్ వ‌ర‌కు దీనిని అమ‌లు చేస్తున్నామ‌ని మంత్రి వివ‌రించారు.

ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చార‌ని నారా లోకేష్ దుయ్య‌బ‌ట్టారు. ఒక్క పెట్టుబ‌డిని కూడా తీసుకు రాలేద‌ని.. గ‌త టీడీపీ హ‌యాంలో తీసుకువ‌చ్చిన పెట్టుబ‌డుల‌ను కూడా త‌రిమేశార‌ని విమ‌ర్శించారు. వైసీపీ నాయ‌కులు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ఒక్క దానిని కూడా ప‌ట్టించుకోలేద‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక‌.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే దిశ‌గా అడుగులు వేస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉంటున్నామ‌న్నారు. వైసీపీ తెచ్చిన చెత్త‌పై ప‌న్నును ర‌ద్దు చేశామ‌ని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ర‌ద్దు చేసి.. రైతుల‌కు ఊపిరిలూదామ‌ని అన్నారు.

కూట‌మి ప్ర‌భుత్వం లో తొలి ఏడాదిలోనే 10 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌కు పైగా పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చామ‌ని.. వివ‌రించారు. భ‌విష్యత్తులో 20 ల‌క్ష‌ల‌కు పైగా ఉద్యోగాలు క‌ల్పించే దిశ‌గా దీనికి రెండింత‌లు ఉపాధి కూడా ల‌భించే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని మంత్రి వివ‌రించారు. రాష్ట్ర ప్ర‌జ‌లు ఇప్పుడు ప్ర‌శాంతంగా జీవిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. తాజాగా నిర్వ‌హించిన అంత‌ర్జాతీయ యోగాతో రాష్ట్రం కీర్తి ప్ర‌తిష్ఠ‌లు ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించాయ‌ని మంత్రి చెప్పారు.