పాక్‌పై ట్రంప్ ప్రేమ.. తెరవెనక స్టోరీ ఇదా!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల పాకిస్తాన్‌పై ప్రేమ ప్రవచనాలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ట్రంప్ లంచ్‌కి పిలిచాడని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ గంతులేసుకుంటూ వెళ్ళాడు. ట్రంప్ మునీర్‌ను లంచ్‌కి పిలవడానికి… పాకిస్తాన్‌పై ప్రేమ ప్రవచనాలు కురిపించడం వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఇరాన్‌పై అమెరికా దాడికి సిద్ధమవుతోంది. పాకిస్తాన్–ఇరాన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. పైగా ఇరాన్‌కు పాకిస్తాన్ సరిహద్దు దేశం కూడా..! తాము ఇరాన్‌పై దాడి చేయడానికి పాకిస్తాన్ భూమిని వాడుకోవాలని అమెరికా చూస్తోంది. అదే జరిగితే ఇరాన్‌కు పాకిస్తాన్ కూడా శత్రుదేశంగా మారుతుంది.

గతంలో ఆఫ్గనిస్తాన్‌పై యుద్ధం చేసినప్పుడు అమెరికా పాకిస్తాన్ భూభాగాన్ని బాగా వాడుకుంది. ఇప్పుడు కూడా అదే దిశగా అమెరికా ప్రయాణిస్తోంది. పాక్ గడ్డపై నుంచి ఇరాన్‌పై దాడులకు ట్రంప్ ముద్ర వేయాలని చూస్తున్నాడు. అయితే రేపటి రోజున ఇరాన్ పాకిస్తాన్‌ను వదిలిపెట్టదన్న సంగతి స్పష్టం.

భారత్‌లో చాలామంది ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్‌ను విందుకు పిలవటంపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ట్రంప్ మోడీని తన బెస్ట్ ఫ్రెండ్‌ అంటాడు, మరి ఈ మతలబు ఏమిటి అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కానీ అమెరికా లెక్క వేరు. పాకిస్తాన్‌ను యుద్ధంలో ఓ పావుగా వాడుకోవడం మాత్రమే ట్రంప్ లక్ష్యం అన్నది కామన్ సెన్స్ ఉన్నవారికి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ను బలిపశువు చేయబోతున్నాడు.

ట్రంప్ వ్యూహంలో పడేందుకు మోడీ సిద్ధంగా లేరు. కెనడాలో ఉన్నప్పుడు ట్రంప్ ఫోన్ చేసి వైట్ హౌస్‌కి రావాలని అడిగినా మోడీ తిరస్కరించారు. త్వరలో క్వాడ్‌ దేశాల సమావేశం ఇండియాలో జరగనుంది. ఈ మీటింగ్‌కి ట్రంప్ వస్తారు కానీ పాకిస్తాన్ పర్యటనకు మాత్రం వెళ్లరు. గతంలో అమెరికా అధ్యక్షులు ఉపఖండంలో పర్యటించినప్పుడు భారతదేశానికి రావడమో లేదా పాకిస్తాన్‌కి రావడమో చేసేవారు. కానీ ఈసారి ట్రంప్ పాక్‌ను పూర్తిగా పక్కన పెట్టారు.

వాస్తవానికి చెప్పాలంటే, ట్రంప్ పాక్‌పై చూపుతున్న ప్రేమ వెనుక తన స్వార్థం మాత్రమే ఉంది. ఇరాన్‌పై దాడికి పాకిస్తాన్‌ను వేదికగా ఉపయోగించాలన్నదే లక్ష్యం. అంతకుమించి ఏం లేదు. అదే జరిగితే యుద్ధానంతరం పాకిస్తాన్ పరిస్థితి మరింత దుర్భరంగా మారడం ఖాయం.