కేసీఆర్ 3 వేల కావాలంటే.. రేవంత్ వెయ్యి చాలంటున్నారు: హరీశ్

గోదావరి నుంచి ఏటా సముద్రంలో వృథాగా కలుస్తున్న జలాల ఆధారంగా ఏపీ నిర్మించతలపెట్టిన బానకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత, సాగునీటి శాఖ మాజీ మంత్రి హరీశ్ రావుల మధ్య మాటల తూటాలు ఇంకా పేలుతూనే ఉన్నాయి. బానకచర్ల విషయంలో అయినా, ఇంకే ప్రాజెక్టు విషయంలో అయినా పొరుగు రాష్ట్రాలతో గొడవలు అవసరం లేదని, సామరస్యపూర్వకంగానే పరిష్కరించాలని నిర్ణయించినట్లుగా రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ విషయంలో తానే ఓ అడుగు ముందుకేసీ ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలు జరుపుతానన్నారు. ఈ వ్యాఖ్యలపై హరీశ్ ఘాటుగా స్పందించారు.

అయినా బీఆర్ఎస్ మీదా, నాటి సీఎం కేసీఆర్ మీదా రేవంత్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని హరీశ్ మండిపడ్డారు. గోదావరి నుంచి సముద్రంలో కలిసే 3 వేల టీఎంసీల్లోనూ తెలంగాణ వాటాగా 1,950 టీఎంసీలను ఇవ్వాలని కేసీఆర్ నాడే అడిగారని ఆయన చెప్పారు. అంతేకాకుండా సాధారణంగా గోదావరిలో లభించే 968 టీఎంసీలతో కలుపుకుని మొత్తంగా 2,918 టీఎంసీల వాటాను నాడు కేసీఆర్ డిమాండ్ చేశారన్నారు. అయతే ఇప్పుడు రేవంత్ మాత్రం గోదావరిలో కేవలం 1,000 టీఎంసీలు ఇస్తే చాలునని, బానకచర్లకు తాము ఎలాంటి అబ్యంతరం చెప్పబోమని చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.

చంద్రబాబుతో చర్చలు జరుపుతామన్న రేవంత్ వ్యాఖ్యలతోనూ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర బయట పడిపోయిందని కూడా హరీశ్ రావు ఆరోపించారు. ముందుగానే చంద్రబాబుతో చర్చలు జరిపిన తర్వాతే రేవంత్ రెడ్డి ఈ మాటలు మాట్టాడుతున్నారని బావించాల్సి వస్తోందని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో రేవంత్ రెడ్డి లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముందని కూడా ఆయన ఆరోపించారు. కేబినెట్ భేటీ, ఆ తర్వాత చంద్రబాబుకు చర్చల కోసం ఆహ్వానం ముందుగా కుర్చుకున్న ఫిక్సింగ్ లో భాగమేనని హరీశ్ ఆరోపించారు.